రెడ్ బుక్ అంటూ ఏపీ రాజకీయాలలో నారా లోకేష్ సృష్టించిన ప్రకంపనలు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకాయి. అలాగే ఈ రెడ్ బుక్ ప్రత్యర్థి పార్టీల నాయకులను సైతం ఆకర్షించింది. దీనితో ఎవరికీ వారు వారి పార్టీ రంగులతో బుక్ లను సృష్టిస్తూ తమ పార్టీ క్యాడర్ లో భరోసా కల్పించే పనిలో పడ్డారు.
అందులో భాగంగానే తెలంగాణలో బిఆర్ఎస్ గులాబీ బుక్ అంటూ, టి. బీజేపీ కాషాయం బుక్ అంటూ ముందుకొస్తే ఏపీలో వైసీపీ బ్లూ మరియు గ్రీన్ బుక్స్ లను ప్రకటించింది.
ఇక వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి సైతం తన పార్టీ కార్యకర్తల ఫిర్యాదుల కోసం డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టారు. వైసీపీ కార్యకర్తలకు ఎవరి నుండైనా వేధింపులు ఎదురైతే వారు తక్షణమే ఈ డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, ఆ ఫిర్యాదులు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళతాయని వైసీపీ ప్రకటించింది.
అయితే ప్రత్యర్థి పార్టీల నుండి వైసీపీ కార్యకర్తలకు ఎదురయ్యే వేధింపులను తెలుసుకోవడానికి జగన్ ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ బుక్ లో వైసీపీ కి తలవంపులు తెచ్చిపెట్టేలా వైసీపీ నాయకులను నుంచి సామాన్యులకు ఎదురయ్యే సమస్యలను లేవనెత్తుతూ ఒక ఫిర్యాదు నమోదయ్యింది.
వైసీపీ మాజీ మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితులు అయిన విడుదల రజని మీద డిజిటల్ బుక్ లో ఫిర్యాదులు నమోదు చేసారు. నవతరం పార్టీ చీఫ్ రావు సుబ్రహ్మణ్యం 2022 చిలకలూరి పేటలోని తన పార్టీ ఆఫీస్, ఇంటి పై విడుదల రజని దాడి చేయించారని, వైస్ జగన్ తనకు న్యాయం చెయ్యాలంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అంశంలో విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా జగన్ చర్యలు తీసుకుంటే కార్యకర్తల కోసం పార్టీ అధినేత ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ బుక్ పై వైసీపీ క్యాడర్ కు పూర్తి నమ్మకం వస్తుందని, ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదులు నమోదు చేస్తే అవి జగన్ దృష్టిలో పడతాయనే భరోసా పార్టీ శ్రేణులకు కలుగుతుందంటూ పేర్కొన్నారు రావు సుబ్రహ్మణ్యం.
మరి సుబ్రహ్మణ్యం సమస్యకు జగన్ పరిష్కారం చూపుతారా.? తమ నేతల అరాచకానికి అడ్డుకట్ట వేస్తారా.? లేక ఈ డిజిటల్ బుక్ కేవలం పార్టీ శ్రేణుల ను మరోసారి మభ్య పెట్టడానికే అన్నట్టుగా వ్యవహరిస్తారా.? అయితే గతంలోనూ ఈ మాజీ మహిళా మంత్రికి వ్యతిరేకంగా సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే.




