వైసీపి 5వ జాబితా జారీ… అసమ్మతి కూడా రెడీ!

YSRCP Media

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఈసారి ఎన్నికలలో 175/25 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు జాబితాలలో 58 శాసనసభ, 10 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను మార్చుకున్నారు. తాజాగా బుధవారం విడుదల చేసిన 5వ జాబితాలో మూడు శాసనసభ, 4 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను మార్చుకున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు (అభ్యర్ధులు):

ADVERTISEMENT

నర్సారావుపేట: పోలుబోయిన అనిల్ కుమార్‌ యాదవ్

మచిలీపట్నం: సింహాద్రి రమేష్ బాబు

కాకినాడ: చలమలశెట్టి సునీల్

తిరుపతి (ఎస్సీ): మద్దిల గురుమూర్తి

శాసనసభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు (అభ్యర్ధులు):

సత్యవేడు (ఎస్సీ): నూకతోటి రాజేష్

అరకు వేలీ (ఎస్టీ): రేగం మత్స్యలింగం

అవనిగడ్డ: డా.సింహాద్రి చంద్రశేఖర రావు.

ఈ 5వ జాబితాతో పాటు ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గానికి, అలాగే కందుకూరు, సంతనూతలపాడు, కావాలి శాసనసభ నియోజకవర్గాలకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీ విజయ సాయిరెడ్డి రీజినల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తున్నట్లు వైసీపి ప్రకటించింది.

ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మళ్ళీ టికెట్‌ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ కుదరదని అక్కడి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని మొన్నే సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పేశారు.

సజ్జల చెప్పిన్నట్లుగానే 5వ జాబితాలో ఒంగోలు లోక్‌సభ బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారు. కనుక బాలినేని మాగుంట ఇద్దరూ తమ దారి తాము చూసుకోవచ్చని జగన్‌ చెప్పేసిన్నట్లే భావించవచ్చు. బాలినేని ఇప్పటికే పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నారు. బహుశః నేడు మీడియా ముందుకు వచ్చి తమ నిర్ణయం కూడా ప్రకటిస్తారేమో?

ఇక నెల్లూరు అర్బన్ వైసీపి ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్ ఇంతకాలం తనకు నెల్లూరులో తిరుగే లేదని, పార్టీని వీడిన కోటంరెడ్డి, మేకపాటి, ఆనం ముగ్గురికీ తన తడాఖా చూపిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు నెల్లూరు నుంచి నర్సారావుపేటకు వచ్చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నెల్లూరి నుంచి ఊడిపడిన ఆయనను నర్సారావుపేట వైసీపి శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని ఈసారి తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని జగన్‌ ఆదేశించి, సత్యవేడు టికెట్‌ నూకతోటి రాజేష్‌కి ఇచ్చారు. ఈ మార్పుకి అంగీకరించని ఆదిమూలం పార్టీకి రాజీనామా చేసారు. 5వ జాబితా వచ్చేసింది కనుక నేడో రేపో టిడిపిలో చేరబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories