మీ ట్వీట్లో నీతి నిజాయితీ: బెల్లం పాకంలా కారిపోతోందక్కా!

Vidadala Rajini Tweet

లెక్కలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర సబ్జెక్ట్స్ లో నిర్ధిష్టమైన ఫార్ములాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ గత కొన్నేళ్ళుగా రాజకీయాలలో కూడా ఇంతకంటే ఖచ్చితమైన ఫార్ములాలు ఏర్పడ్డాయనే సంగతి అందరి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు.

అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారాజ్యం చేసి, అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు చేయకూడని నేరాలు, ఘోరాలు అన్నీ చేస్తూ ముసిముసినవ్వులతో నీతులు వల్లించడం ఓ ఫార్ములా.

ADVERTISEMENT

అధికారం కోల్పోయి కేసులలో చిక్కుకున్నప్పుడు అవన్నీ అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులని వాదించడం ఓ ఫార్ములా. అక్రమాస్తుల కేసులలో జగన్‌ ఈ ఫార్ములాని ఎప్పటి నుంచి వాడుకుంటున్నారు.

కేసులలో చిక్కుకున్నప్పుడు వీలైతే కులం కార్డు బయటకు తీసి వాడుకొని ఎదురుదాడి చేయడం మరో ఫార్ములా. అదే మహిళా నేతలకైతే మహిళ కావడమే ఓ అదనపు అర్హత. ఈ కేసులు రాష్ట్రంలో మహిళలందరి ఆత్మగౌరవానికి సంబందించిన సమస్య అని వాదించడం మరో ఫార్ములా. మన రాజకీయాలలో ఇలాంటి ఫార్ములాలు చాలానే ఉన్నాయి.

పల్నాడు జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో చిన్న స్టోన్ క్రషర్ కంపెనీ యాజమానిని బెదిరించి బలవంతంగా రూ.2.20 కోట్లు దండుకునందుకు, ఏసీబీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు చేసింది.

బాధితులు స్వయంగా పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసినందునే ఈ వ్యవహారంలో ఆమెతో సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

కనుక నేడో రేపో విడదల రజనితో సహా నలుగురికీ నోటీసులు రావడం, రిమాండ్‌పై జైలుకి వెళ్ళడం దాదాపు ఖాయమే.

కనుక ఆమె ఫార్ములా ప్రకారం సోషల్ మీడియాలో నాలుగు పంచ్ డైలాగులు వేసేశారు.

“నా మనో ధైర్యాన్ని దెబ్బ తీయాలనే కుట్రలు, నా వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు.. ఒక మహిళనైనా నాపై అక్రమకేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వెయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి నేను సిద్దం.

నా ధైర్యం.. నా నిజాయితీ, నా ధైర్యం.. నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…..” అని ట్వీట్ చేశారు.

విలువలు, విశ్వసనీయత కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే కాదు పార్టీలో అందరికీ సమానంగా ఉన్నాయని విడదల రజని ట్వీట్ చూస్తే అర్దమవుతుంది. నీతి నిజాయితీ, న్యాయం, ధర్మానికి కట్టుబడిన ఆణిముత్యాల వంటి నేతలతో వైసీపీ నిండిపోయిందనిపిస్తుంది.

కానీ ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, సీబీఐ, ఈడీలే తమని అపార్ధం చేసుకుంటున్నాయని, కేవలం రాజకీయ ఒత్తిళ్ళతోనే తమవంటి నీతివంతులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నాయని భావించాల్సి ఉంటుంది. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవన్నట్లు నీతి నిజాయితీగా రాజకీయాలు చేసుకునే వైసీపీ నేతలకే కష్టాలన్నీ వస్తున్నాయి. ఏం చేస్తాం? ఇది కలియుగం. ఇలాగే జరుగుతుందని సర్దుకుపోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories