ఆ ఛానల్ మీద మన రాజకీయ జీవితాలన్నీ ఆధారపడున్నాయ్!

Kodali-Nani-Sakshi-channelవిభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, హైదరాబాద్ నుండే పార్టీ కార్యకలాపాలను చేస్తున్న వైసీపీ ఎట్టకేలకు పార్టీ ఆఫీస్ ను విజయవాడలో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తన స్వరానికి పదునుపెట్టి, యధావిధిగా ఏకవచన సంభోదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసారు.

తెలుగుదేశం నేతలను ‘సన్నాసులు’గా పేర్కొన్న కొడాలి నాని, ఏపీ సిఎంను ‘చవట సన్నాసి’గా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డికి అనేక అవలక్షణాలు ఉన్నాయని చంద్రబాబు తనకు చెందిన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ‘కొడాలి’ మార్క్ పదజాలంతో మండిపడ్డారు. ఇదే సమయంలో ఏపీలో ఉన్న ఏకైక ‘మగాడు’గా ప్రశంసలతో ముంచెత్తారు.

ADVERTISEMENT

అదీ గాక, ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న సాక్షి ఛానల్ ప్రసారాలను ఆపేసారని, సాక్షి టీవీ అంటే ఒక ఏబీఎన్, టీవీ 9, ఎన్టీవీ మాదిరి కాదు, రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు చెందిందని, తామూ ఇక్కడ నుండి ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రంలో ఒక్క ఛానల్ కూడా మిగలదని, పోల్స్ పై ఒక్క తీగ కూడా ఉండదని.., మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నీకు… నీ తమ్ముడు కొడుకు సినిమాలు, నీ బావమరిది సినిమాలే చూడాలా… మా ఇష్టమొచ్చినవి చూసే హక్కు ఉంది… ఆంధ్రప్రదేశ్ ఏమైనా నీ బాబు జాగీరా అంటూ తీవ్ర స్వరం వినిపించారు.

ఇంకా రెండు రోజులు మాత్రమే చూస్తాం, ఈ లోపున సాక్షి ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించకుంటే రాష్ట్రంలో ఏ ఛానల్ ప్రసారాలు లేకుండా చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటూ చంద్రబాబు సర్కార్ ను హెచ్చరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది… ఆ ఛానల్ ను డబ్బు కోసం జగన్ గారు పెట్టలేదు, ఆ ఛానల్ మీద మన రాజకీయ జీవితాలు ఆధారపడున్నాయ్… సిటీకేబుల్ ఎమ్మెస్వోలు గుర్తుపెట్టుకోవాలని, ఛానల్ ప్రసారాలు కాకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు కొడాలి నాని.

గుడివాడ ఎమ్మెల్యే ప్రసంగం విన్న, చూసిన తర్వాత ఒక అభిప్రాయం కలగడం సహజం. ఇటీవల వైసీపీ అధినేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, ఆ మోతాదును మరింతగా పెంచి, ఇంకాస్త రెచ్చగొట్టే ధోరణిలో కొడాలి వ్యాఖ్యానించడం గమనించవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర సర్కార్ ను బెదిరిస్తున్నట్లుగా కొడాలి నాని వ్యాఖ్యలు ఉండడం, అలాగే సాక్షి ఛానల్ ప్రసారాలు లేనిదే తమ పార్టీ నేతల జీవితాలు లేవన్నట్లుగా వ్యాఖ్యానించడం వెనుక ఏ స్థాయిలో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారో అవగతం చేసుకోవచ్చు.

మరి సాక్షి ఛానల్ పైనే జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పిన కొడాలి… ఒకవేళ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా సదరు ఛానల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వైసీపీ నేతల పరిస్థితి ఏం కానూ? అలాగే పార్టీ భవిష్యత్తు ఏం కానూ? అన్న ప్రశ్నలు సగటు వైసీపీ అభిమానులను తలచివేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories