వైసీపీ టెక్నాలజీ తో రాజకీయాలకు ఒక కొత్త ఒరవడిని పరిచయం చేసింది. అయితే ఆ ఒరవడి లో పడి వైసీపీ కొట్టుకుపోతుందే కానీ కోలుకోవడం లేదు. అదే ‘ఐ ప్యాక్’ రాజకీయం.
ఐ ప్యాక్ టీం అంటూ వందల మందిని నియమించి రాజకీయాలకు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ ను, ఫేక్ ప్రచారాలను, ఫేక్ పారిశ్రామిక వేత్తలను, కల్పిత భాదితులను, కల్పిత లబ్దిదారులను సృష్టించారు జగన్.
వీరంతా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి మారు రూపాలలో ప్రత్యక్షమయిపోతారు, వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నటించి వెళ్ళిపోతారు. వీరంతా వారి వారి పాత్రల మేరకు నటించి ప్రజలలో వైసీపీ పట్ల సానుకూల దృక్పధాన్ని, జగన్ పట్ల సమైక్య భావాన్ని కల్పించేందుకు కృషి చేస్తారు.
ఇందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో ఐ ప్యాక్ టీం సభ్యులు కొందరు ఐటీ పారిశ్రామిక వేత్తలుగా, ఐటీ ఉద్యోగస్తులుగా రూపం మార్చి మీడియా ముందుకొచ్చి వైసీపీ గొప్ప మనసున్న ప్రభుత్వమని, జగన్ మంచి హృదయం ఉన్న నేత అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసారు.
అలాగే జగన్ వెళ్లే పర్యటనలకు జనసమీకరణ నుంచి అక్కడ వారు పార్టీ కార్యకర్తలుగా చెయ్యవలసిన నినాదాల వరకు మొత్తం ఐ ప్యాక్ చూసుకుంటుంది. దీనితో ప్రజల దృష్టిలో జగన్ కు ప్రజా బలం ఏ మాత్రం తగ్గలేదు అనే భావన కల్పించవచ్చు,
క్యాడర్ లో జగన్ నాయకత్వం మీద నమ్మకం సడలలేదు అనే భరోసా అందించవచ్చు అనేది ఈ ఐ ప్యాక్ రాజకీయం యొక్క లక్ష్యం. అయితే గత ఐదేళ్లు వైసీపీ ఈ ఐ ప్యాక్ రాజకీయాల మాయా క్రీడలో మునిగి అసలు ప్రజా క్షేత్రంలో వైసీపీ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది.?
జగన్ నాయకత్వం మీద ఎంతటి అవిశ్వాసం ఏర్పడింది అనే కనీస సమాచారాన్ని పార్టీ క్యాడర్ కు కూడా చేరనివ్వలేదు. అందుచేతే వైసీపీ ఈ స్థాయి ఘోర ఓటమిని పార్టీ క్యాడర్, లీడర్ కూడా జీర్ణించుకోలేకపోయారు.
కనీసం పార్టీ ఓటమి తరువాత అయినా వైసీపీ గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పటికి అదే ఐ ప్యాక్ రాజకీయాన్ని కొనసాగిస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తూ పార్టీని గెలుపు భ్రమలో ఉంచుతూ పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను నిట్ట నిలువునా మోసం చేస్తుంది.
జగన్ ఇప్పుడు చేస్తున్న జైలు యాత్రలు కావచ్చు, పరామర్శ పర్యటనలు కావచ్చు, జగన్ తాడేపల్లి పాలస్ గడప దాటి బయట అడుగు పెట్టింది మొదలు తిరిగి ప్యాలస్ గేటు లోపలికి వెళ్లే వరకు జరుగుతున్న హంగామా మొత్తం, చేస్తున్న సీఎం సీఎం నినాదాలు సైతం ఈ ఐ ప్యాక్ రాజకీయంలో భాగమే అనేది పొలిటికల్ స్కిల్స్ లో జరుగుతున్న గట్టి ప్రచారం.
ఆ ప్రచారమే వైసీపీ ని కళ్ళు తెరవనివ్వడం లేదు, వాస్తవాలను తెలుసుకోనివ్వడం లేదు. నాటి వైసీపీ 11 ఘోర ఓటమికి నేటి పులివెందుల పరాభవానికి ఈ ఐ ప్యాక్ రాజకీయం వైసీపీ ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికైనా రప్ప రప్ప పోస్టర్లతో ప్రజలలో వైసీపీ సాధించింది ఏమిటో.? AI వీడియో లంటూ కట్టుకథలతో జగన్ మెప్పించేదెవరినో వైసీపీ గ్రహించాలి.
లేకుంటే రానున్న ఎన్నికల వరకు కళ్ళు మూసుకోండి సరిపోతుంది అంటున్న జగన్ ప్రకటనలు వైసీపీ నేతలకు జీవితకాలపు పాఠాలుగా మిగిలిపోతాయి. తద్వారా వైసీపీ ఇక ఎప్పటికి కళ్ళు తెరిచి రాజకీయం చేసే పరిస్థితి ఉండదు, జగన్ ఉండనివ్వరు కూడా.




