ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ నేతలు తమ పరిస్థితి ఏమిటని భయపడేవారు. కానీ ఇప్పుడా భయం లేదు.
నిజానికి ప్రతిపక్షాలు అధికార పార్టీని చూసి భయపడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఉంటే అక్కడ ప్రజాస్వామ్యం లేనట్లే!
కానీ వైసీపీ నేతలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని గొంతు చించుకుంటున్నారు. అంటే లేదని కాదు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తోంది కనుకనే వారు నిందించగలుగుతున్నారన్న మాట!
ఇదే వైసీపీకి చాలా అలుసుగా కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు చేస్తున్న హడావుడి కనిపిస్తోంది.
పట్టణంలో ఓ దుకాణం కాంట్రాక్ట్ తనకు అప్పజెప్పాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, అనుచరులు ఆ దుకాణ యజమానిని చాలా కాలంగా వేధిస్తున్నారు. అతనిని బలవంతంగా తమతో తీసుకు వెళ్ళి ఓ గదిలో బందించి చితకబాదారు. అంతటితో ఆగలేదు. ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.
ఇటువంటిదే మరో సంఘటన… రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లో జరిగింది. సిఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దీనిలో వైసీపీకి వీర విధేయులైన ఇద్దరు ఉద్యోగాలు సంపాదించారు. ఈ విషయం ఈనాడు పత్రిక బయటపెడితే తప్ప కూటమి ప్రభుత్వానికి తెలియలేదు!
ఈనాడులో ఈ వార్త వచ్చిన తర్వాత అధికారులు హడావుడిగా వారిని విధులలో నుంచి తప్పించి మిగిలిన 31 మంది ‘రాజకీయ బ్యాక్ గ్రౌండ్’ గురించి ఆరా తీస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమలకు వచ్చారు. తిరుమలలో అన్యమతస్తులు పనిచేస్తుండటాన్ని ఆయన విమర్శించారు. ఆ తర్వాతే టిటిడీ మేల్కొని హడావుడిగా ఇద్దరిని విధులలో నుంచి తప్పించి చేతులు దులుపుకుంది!
అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవస్థలపై వైసీపీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని ఈ మూడు ఘటనలు నిరూపిస్తున్నాయి.






