వైసీపీ నేతలు బిజీ బిజీ… ఒకరు బయటికి మరొకరు లోపలికి!

YSRCP Leaders

ఇంత కాలం అధికారంలో ఉన్నప్పుడు చాలా బిజీ బిజీగా గడిపిన వైసీపీ నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. నాటికీ నేటికీ ఒకటే తేడా. నాడు అధికార కార్యక్రమాలతో బిజీగా ఉంటే నేడు పోలీస్ స్టేషన్‌లు, కోర్టులు, కేసులతో బిజీగా ఉన్నారు. ఓ కేసులో ఒకరు లోపలకు వెళుతుంటే మరొకేసులో మరొకరు బెయిల్‌పై బయటకొస్తున్నారు.

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి గుంటూరు జైలు నుంచి బెయిల్‌పై బయటకు రాగా, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డికి ఎన్టీఆర్ జిల్లా సబ్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు.

ADVERTISEMENT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా లోపలే ఉన్నారు. ఆయన బయటకు వచ్చేలోగా ఆయన ప్రాణ స్నేహితుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని లోపలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

ఈలోగా మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్లు, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణ రూ.10 లక్షలు, విజిలెన్స్ అధికారి పల్లె జాషువా రూ.10 లక్షలు వసూలు చేసిన కేసులో వారు ముగ్గురితో పాటు ఆమె మరిది గోపీపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

విడదల రజని ఏ-1, పల్లె జాషువా ఏ-2, గోపీ ఏ-3, దొడ్డ రామకృష్ణ ఏ-4 నిందితులుగా ఏసీబీ పేర్కొంది. కనుక నేడో రేపో విచారణ, ఆ తర్వాత వారి అరెస్ట్‌, రిమాండ్‌, జైలు, బెయిలూ వగైరా తంతు తప్పక జరుగుతుందని భావించవచ్చు.

వీరు నలుగురు లోపలికి వెళ్ళే సమయానికి వల్లభనేని వంశీ బెయిల్ సంపాదించుకొని బయటకు వస్తారేమో? మధ్యలో కొడాలి నాని స్టోరీ కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీ నాయకులు ఇంత బిజీగా ఉంటున్నందున వారికి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సమయం చిక్కడం లేదు కనుక వారిని తప్పు పట్టడానికి లేదు.

ADVERTISEMENT
Latest Stories