రాజకీయ నాయకులు పార్టీ కండువాలు మార్చడం, ఓడిన పార్టీని వదిలి నియోజకవర్గ అభివృద్ధి అంటూ అధికార పార్టీకి షిఫ్ట్ కొట్టడం తరచూ జరిగే రాజకీయ ప్రక్రియే.
అయితే అందులో కొంతమంది నాయకులు కండువాల మార్పుతో పదవులు దక్కించుకుని అందలం ఎక్కితే మరికొంతమంది నేతలు అధికారంలో ఉన్నా అజ్ఞాతంలోనే ఉంటుంటారు.
ఇందుకు వైసీపీ నుండి జనసేనకు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను, కిలారి రోశయ్య, వైసీపీ ని వీడి టీడీపీ సైకిల్ ఎక్కిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు వంటి వైసీపీ కీలక నాయకులు చక్కటి ఉదాహరణలు.
వీరిలో కొంతమంది నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా అందలం ఎక్కిన వారు మరియు వైస్ కుటుంబానికి వీర విధేయులుగా నడుచుకున్నవారు. అయితే వీరంతా 2024 ఎన్నికల తరువాత వైసీపీ వింత పోకడలను, జగన్ నియంతృత్వ ధోరణులను ఎండగడుతూ పార్టీని వీడారు.
కూటమి లో భాగంగా ఇటు టీడీపీ, అటు జనసేన రెండు అధికార పార్టీలుగా చెలామణి అవుతున్నప్పటికీ వీరందరూ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉంటున్నారు. పేరుకు మాత్రమే అధికార పార్టీ వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నాయకుల వలె మీడియాకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉంటున్నారు.
అయితే కూటమిలో భాగంగా ఈ సోకాల్డ్ నాయకుల చేరికను ఇతర మిత్ర మిత్రపక్షాల నేతలు అంగీకరించలేకపోతున్నారు. ఇటు బాలినేని చేరిక విషయంలో స్థానిక టీడీపీ లీడర్లు, కార్యకర్తలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు.
చివరికి టీడీపీ వారి ఆవేదనను చల్లార్చడానికి బాలినేనే కూటమి కోసం కలిసి పనిచేద్దాం అంటూ బహిరంగ ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఇరు పార్టీల మధ్య సాన్నిహిత్యం అయితే కుదరలేదు. ఇక సామినేని, కిలారి, మోపిదేవి విషయంలో ఆ స్థాయి వ్యతిరేకత రాకున్నా వీరు మాత్రం రాజకీయంగా అంతగా యాక్టీవ్ గా లేరనే చెప్పాలి.
ఇలా వైసీపీ వంటి ఓటమి పార్టీ నుండి కూటమి వంటి గెలుపు పార్టీలో చేరినప్పటికీ వీరంతా ఇప్పటికి రాజకీయంగా వెనకబడే ఉన్నారు, అయితే ఈ వెనుకబాటు వెనుక స్వీయ నిర్ణయం ఉందా.? లేక పార్టీల అధినేతల ఆదేశాలున్నాయా.? లేక సరైన సమయం, సందర్భం వీరందరూ కోసం వేచి చూస్తున్నారా.? అనేది తెలియాలి.






