యధారాజా తధాప్రజా అన్నట్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసుల గుడ్డలూడదీసి కొడతానని బెదిరిస్తుంటే, మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వర రావు తలలు నరుకుతామని టీడీపీ నేతలను బెదిరించారు.
ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, “మీ ఇంటికి మా ఇళ్ళు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇళ్ళు అంతే దూరం. రేపు మేము మళ్ళీ అధికారంలోకి రాగానే గుంటూరు ఇవతల ఉన్నవారిని ఒక్కొక్కరిని ఇళ్ళలో నుంచి బయటకు లాగి కొడతాము. గుంటూరు అవతల ఉన్నవారి తలలు నరికేస్తాము,” అని కారుమూరి నాగేశ్వర రావు టీడీపీ నేతలను హెచ్చరించారు.
ఆయన వ్యాఖ్యలపై టీడీపీ స్పందిస్తూ, “జగన్ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినా, వైసీపీ నేతల్లో అధికార మదం ఇంకా దిగలేదు. వైసీపీ నేరచరిత్రకు కారుమూరి వ్యాఖ్యలే నిదర్శనం,” అని సోషల్ మీడియాలో ఘాటుగా జవాబిచ్చింది.
జగన్, కారుమూరి తదితర వైసీపీ నేతలు చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు ఏదో క్షణికావేశంతో అంటున్న మాటలుగా కొట్టి పడేయలేము. గత తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వాన్ని, దాని ఐక్యతని దెబ్బ తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఈ కొత్త వ్యూహం అమలుచేస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది.
ఈవిదంగా తమ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేయగలిగితే పరస్పర దాడులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయని, అప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరవచ్చని, మళ్ళీ ఢిల్లీలో దీక్షకు కూర్చొని చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నారని జాతీయస్థాయిలో దుష్ప్రచారం చేయవచ్చని జగన్ వ్యూహం అయ్యుండవచ్చని టీడీపీ అనుమానిస్తోంది.
ఈ ప్రయత్నంలో జగన్ తన పార్టీ నేతలు, కార్యకర్తలకి నష్టం కలిగించేందుకు కూడా వెనకాడటం లేదు. కానీ టీడీపీ ఆవిదంగా చెయ్యలేదు కనుక అదే దాని బలహీనతగా మారుతుంది. కనుక టీడీపీ ఈ ఉచ్చులో పడకుండా తన బలహీనతని అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.






