వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు తమ విచారణలో పేర్కొన్నారు. అయితే తవ్వేకొద్దీ ఎలకలు అన్నట్టుగా ఈ మద్యం స్కాం లో కూడా విచారణ జరిపే కొద్ది నిందితులు బయటకొస్తున్నారు.
కసిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో మొదలైన ఈ కేసు మిథున్ రెడ్డి వరకు వచ్చింది. ఇక రేపోమాపో ఈ స్కాం వెనుక ఉన్న అసలు సూత్రదారులు కూడా తెరముందుకు రాబోతున్నారు అంటూ తాడేపల్లి బిగ్ బాస్ పేరు కూడా ప్రచారంలో వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు తాజాగా సిట్ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ ప్రమేయం పై వివరాలను పొందుపరిచినట్లు తెలుస్తుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ తో కలిపి సిట్ ఈ కేసులో ఇప్పటికి మూడు ఛార్జ్ షీట్లను నమోదు చేసినట్లయింది.
అయితే ఈ ఒక్క స్కాం లోనే ఇంతమంది పేర్లు అందునా వైసీపీ కి సంబంధించిన కీలక నేతలు, జగన్ కు అత్యంత సన్నిహితులు, అలాగే ముఖ్యంగా జగన్ సామజిక వర్గానికి చెందినవారు బయటకు రావడం ఇక్కడ విశేషం. వైసీపీ నవరత్నాలు అంటూ రాష్ట్రంలోని పేద వర్గాలకు తెరముందు బటన్ నొక్కినట్టే,
ఇలా వైసీపీ లోని పేద నాయకుల కోసం, వారి ఆర్థిక సంక్షేమం కోసం కూడా స్కాముల రూపంలో వైసీపీ పథకాలను ప్రవేశ పెట్టి తెరవెనక బటన్ నొక్కిందా.? అయితే తెరముందు నొక్కిన బటన్ల వలన లబ్ధిదారుల జీవితాలలో ఎటువంటి ఆర్థిక వృద్ధి కనిపించనప్పటికీ,
ఈ విధంగా తెరవెనుక నొక్కిన బటన్లు ఫలితంగా లిక్కర్ స్కాం లబ్దిదారులకు కొన్ని వేల కోట్ల లబ్ది చేకూరినట్టు సమాచారం. అయితే నవరత్నాలు పేద ప్రజల సంక్షేమ పథకాలైతే – లిక్కర్ స్కాములు వైసీపీ వర్గానికి సంక్షేమ పథకాలనుకోవాలా.?
అయితే ఆ నవరత్నాలకు వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, వైస్ జగన్ బహిరంగ సభలతో బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిర్వహించి ఆ పథకాల క్రెడిట్ మొత్తం వైసీపీ దే, వైస్ జగన్ దే అంటూ నానా హంగామా చేసారు.
కానీ ఈ లిక్కర్ స్కాం అవినీతి పథకాలు మాత్రం వైసీపీ గుట్టుచప్పుడు కాకుండా ముగించేసింది. అలాగే దీని తాలూకా క్రెడిట్ కానీ, ఈ స్కాం తాలూకా అవినీతి ఆరోపణలు కానీ తీసుకోవడానికి ఇటు వైసీపీ కానీ అటు జగన్ కానీ ముందుకు రాలేకపోవడమే ఇక్కడ కొస మెరుపు.
అయితే ఆ నవరత్నాలు పేదల సంక్షేమ పథకాలైతే ఈ స్కాములు వైసీపీ అవినీతి పథకాలు…అంతేనా.?





