ఏపీ రాజకీయాలలో వైసీపీ ఒంటరితనం ఎందువల్ల?

Pulivendula-Jaganరాజకీయ పార్టీలు తమ లక్ష్యాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే అవసరమైతే ఒంటరిగా లేదా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తుంటాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపిలు మొదట్లో ఒంటరిగానే పోటీ చేసేవి. కానీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు బలపడటంతో అవి కూడా తప్పనిసరిగా యూపీయే, ఎన్డీయే కూటములు ఏర్పాటు చేసుకొని మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే వాటిని తప్పు పట్టని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటే మహానేరం అన్నట్లు వాదిస్తుండటం విడ్డూరమే కదా?ఒకవేళ కాంగ్రెస్‌, బిజెపిల పొత్తులు తప్పని భావిస్తున్నట్లయితే వాటినీ వైసీపీ తప్పు పట్టాలి కదా? కానీ అవకాశం ఇస్తే ఎన్డీయే కూటమిలో చేరేందుకు వైసీపీ సిద్దపడినట్లు వార్తలు వస్తున్నాయి కదా?

ఆ వార్తలు నిజం కాకపోవచ్చు. కానీ అప్పులు, కేసుల నుంచి ఉపశమనం కోసం కేంద్రంతో అంటకాగుతుండటం నిజమే కదా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు, ‘మాకు బిజెపి అండలేకుండాపోయిందని’ సిఎం జగన్మోహన్ రెడ్డి బాధపడిన మాట నిజమే కదా?అంటే బిజెపి అండ కోరుకొంటున్నట్లే కదా? బహుశః ఆ అండ కోసమే ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, అమిత్‌ షాలతో భేటీ అవడం వాస్తవమే కదా?

ఈవిదంగా వైసీపీ అవసరాల కోసం బిజెపి పెద్దలతో లోపాయికారిగా స్నేహ సంబంధాలు నెరుపుతున్నప్పుడు, టిడిపి, జనసేనలు ఇంకా పొత్తులు పెట్టుకోకమునుపే ఆక్రోశిస్తుండటం దేనికి?ఒకవేళ వైసీపీ అధినేతకు వచ్చే ఎన్నికలలో 175 సీట్లు తామే గెలుచుకోగలమనే ధీమా ఉన్నట్లయితే, ఇక టిడిపి, జనసేనల పొత్తులు పెట్టుకొంటే భయమెందుకు?అంటే 175 సీట్లు గెలుస్తామనే తమ మాటల మీద తమకే నమ్మకం లేదనుకోవాల్సి ఉంటుంది.

ఇక ఒంటరి పోరాటం చేస్తున్నామని చెప్పుకోదల్సితే ఆ మాట గర్వంగా చెప్పుకోవాలి. ధైర్యంగా చెప్పుకోవాలి. కానీ వైసీపీ నేతల నోట ఆ మాట వింటున్నప్పుడు ‘మేము ఒంటరి అయ్యామనే దిగులు’ కనిపిస్తుంటుంది. అది వాస్తవం కూడా. అందుకు వైసీపీ తనను తానే నిందించుకోవాలసి ఉంటుంది.

ఏపీలో అన్ని పార్టీలు, ప్రజలు, మీడియా అందరూ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకొంటుంటే, ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానులు కోరుకొంటోంది. ఈవిదంగా అందరితో విభేధించినప్పుడు ఒంటరికాక తప్పదు కదా?కనుక స్వీయ తప్పిదాలకు ఇతరులను నిందించడం దేనికి?

వైసీపీ ఎంచుకొన్న మార్గమే తప్పయినప్పుడు ఆ మార్గంలో ఒంటరిగానే ప్రయాణం చేయక తప్పదు. బహుశః అందుకే వైసీపీ నేతల మాటలలో దిగులు కనబడుతుంది. వైసీపీ నేతల పరిస్థితి టైటానిక్ షిప్‌లో ప్రయాణిస్తున్నట్లే ఉంది. పాపం!

ADVERTISEMENT
Latest Stories