నేటి నుంచి రేపు సాయంత్రం వరకు విజయవాడ-గుంటూరు రహదారిలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్నవి కావడంతో చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాటిని పర్యవేక్షిస్తున్న ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును మీడియా ప్రతినిధులు పలుకరించి, “ప్లీనరీలో రాబోయే ఎన్నికలకి సమరశంఖం ఊదబోతున్నారా?మీ పార్టీ ఎన్నికలకి సిద్దంగా ఉందా?” అంటూ ప్రశ్నించారు.
వారికి సమాధానం చెపుతూ, “మేము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే డే-వన్ నుంచే ఇదే పని మీదున్నాము. మా పార్టీ ఎన్నికలకి పూర్తి సిద్దంగా ఉంది. మా మ్యానిఫెస్టోలో ఏమి చెప్పామో… అదే చేసి చూపుతున్నాము. అదే ప్లీనరీలో చెపుతాము.. గత మూడేళ్ళలో మేము సంక్షేమ పధకాల ద్వారా ప్రజలకు రూ.1.50 లక్షల కోట్లు పంచిపెట్టాము. గతంలో ఏ ప్రభుత్వామైనా ఇలా చేయగలిగిందా?అందుకే ప్రజలు మా పాలన పట్ల చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగా ఉన్నారు.
కనుక వచ్చే ఎన్నికలలో 120,150 కాదు… మొత్తం 175 సీట్లు మేమే గెలుస్తామని నమ్మకంగా చెప్పగలుగుతున్నాము. అంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా మొత్తం అందరినీ తుడిచిపెట్టేస్తాం అన్న మాట!
వచ్చే ఎన్నికలో కుప్పంలో వైసీపీ విజయం ఖాయం.. అక్కడ వైసీపీ జెండా ఎగరడం ఖాయం. ఇందిరాగాంధీ కొట్టుకుపోలేదా?ఎన్టీఆర్ కొట్టుకుపోలేదా?వాళ్ళే పోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత? ఆయనో లెక్కా? వచ్చే ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతారు. ఇప్పుడే చెపుతున్నా…కావాలంటే రాసుకోండి,” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రతిపక్ష టిడిపిని తుడిచిపెట్టేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని, నేటికీ టిడిపిపై కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలు నిజమని మంత్రి అంబటి రాంబాబు మాటలే నిరూపిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇదే పనిలో ఉన్నామని ఆయనే చెప్పారు.
ఒకవేళ తమ ప్రభుత్వం డే-వన్ నుంచి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందనే ఉద్దేశ్యంతో ఆ విదంగా చెప్పానని మంత్రి అంబటి రాంబాబు సమర్ధించుకొన్నా, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే 5 ఏళ్ళ తరువాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అవుతుంది. ఎన్నికల కోసమే సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు తాయిలాలు పంచుతున్నట్లు మంత్రి అంబటి రాంబాబు నిర్ధారించారు. వచ్చే ఎన్నికలలో ఓట్ల కోసమే పధకాల పేరుతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నప్పుడు, రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం సిఎం జగన్మోహన్ రెడ్డి తపించిపోతూ వారి కష్టాలు తీర్చేందుకే సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని మరి చెప్పుకోవడం ఎందుకు?
సాధారణంగా ఏ ప్రభుత్వమైన కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల మెప్పు కోసం ఒకటో రెండో వారాలు ప్రకటించడం సహజమే. ఆ తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిదంగా ఉంది? రాష్ట్రంలో ఏ ఏ పనులు ఏ దశలో ఉన్నాయి?వాటికి ఎంత ఖర్చు అవుతుంది?ఏవిదంగా పూర్తి చేయాలి?వివిద శాఖలు పనితీరు ఏవిదంగా ఉంది? రాష్ట్రంలో ఏ రంగంలో వెనుకబడి ఉంది?ప్రజలు మన నుండి ఏమి కోరుకొంటున్నారు?వంటి విషయాల గురించి అవగాహన ఏర్పరచుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ అటువంటి ఆలోచన కూడా చేయకుండా డే-వన్ నుంచే 5 ఏళ్ళ తరువాత వచ్చే ఎన్నికల కోసం సంక్షేమ పధకాలను ప్రారంభించేశామని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకోవడం విశేషమే కదా?



