జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా తలకాయలు నరుకుతామని ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే, వారి అధినేత జగన్ వారించకపోగా “పిల్లోళ్ళు ఏదో సరదాగా రప్పా రప్పా అంటూ సినిమా డైలాగులు చెప్పినా నేరమేనా? పుష్పలో అల్లు అర్జున్లా ఇలా గడ్డం కింద చెయ్యి పెట్టినా నేరమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?” అంటూ వారిని సమర్ధించుకున్నారు.
ఒక పార్టీ అధినేత కార్యకర్తలకు ఈవిదంగా దిశానిర్దేశంచేస్తుంటే వారు ఏవిదంగా వ్యవహరిస్తారో వైసీపీలో సీనియర్ నేతలు పేర్ని నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటివారు నిరూపిస్తూనే ఉన్నారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా? అందుకే వైసీపీ కార్యకర్తలు అంతగా రెచ్చిపోతున్నారని అనుకోవచ్చు.
ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అధినేత జగన్ ధోరణితోనే మాట్లాడారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ నవ్వినా, మాట్లాడినా కేసులు పెడతామంటే ఎలా?
ఆ లెక్కన ఈ కోర్టులు, జైళ్ళు కూడా సరిపోవు. నేనేమి ఆమె గురించి అనుచితంగా మాట్లాడలేదు. కానీ నాపై కేసు నమోదు చేసి విచారణకు పిలిచారు కనుక వచ్చి అడిగిన ౪౦ ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చాను,” అని అన్నారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి చాలా అనుచితంగా మాట్లాడినప్పుడు ఆమె వాటిని ఖండించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే, నల్లప్పురెడ్డి మాత్రం, ‘ఆమె గురించి తాను చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నానని’ అని అన్నారు.
అంటే ఆయన పొరపాటున నోరు జారలేదని ఉద్దేశ్యపూర్వకంగానే ఆమె గురించి ఆవిధంగా మాట్లాడారని అర్ధమవుతూనే ఉంది. కానీ ఇవాళ్ళ నేనేమీ తప్పుగా మాట్లాడలేదని, పైగా ఆ మాటలను ఆమె లైట్ తీసుకోవాలన్నట్లు ప్రసన్నకుమార్ రెడ్డి సలహా కూడా ఇస్తున్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈవిదంగా పేట్రేగిపోతుంటే, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు?




