వైసీపీ ఓటమి, ఆ పార్టీలోని కొంతమంది ముఖ్యనేతల అవినీతి చిట్టాను బయటపెడుతుంటే, మరికొంతమంది నాయకుల అరాచకాన్ని వెలుగులోకి తెస్తుంది. ఆ కోవలోకి వచ్చింది చిలకలూరి పేట వైసీపీ కింద స్థాయి నాయకుల పంచాయితీ.
2019 లో మాజీ మంత్రి విడుదల రజని నియోజకవర్గంగా చిలకలూరి పేట రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉంది. వైసీపీ మహిళా ఎమ్మెల్యే గా, మంత్రిగా ఉన్న రజని తన నియోజకవర్గంలో పార్టీ పట్టు కోసం చివరికి సొంత పార్టీ నేతలను సైతం వేధింపులకు గురిచేసారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. “జగన్ ముద్దు రజని వద్దు” అనే స్థాయికి చిలకలూరి పేట వైసీపీ రాజకీయం చేరింది అంటే ఆ నియోజకవర్గంలో విడుదల రజని అరాచకాలు ఏ స్థాయికి చేరుకున్నాయి అర్ధమవుతుంది.
రజని పట్ల ఈ స్థాయి వ్యతిరేఖత బయటకు రావడంతో పార్టీ అధిష్టానం సైతం విడుదల రజని ని చిలకలూరి పేట నుంచి విడుదల చేయక తప్పలేదు. అయితే 2024 ఎన్నికలలో నియోజకవర్గ మార్పు సైతం విడుదల రజని ఓటమిని అడ్డుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో తిరిగి చిలకలూరు పేటకు చేరుకున్న రజని తన రాజకీయాన్ని పునః ప్రారంభించారు. దీనితో అక్కడి స్థానిక నాయకులు, వైసీపీ కార్యకర్తలు రజనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీ శ్రేణులు రజని అరాచకం అంటూ ఆమె రాజకీయం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రజని హయాంలో చిలకలూరి పేట వైసీపీ కార్యకర్తల పై సుమారు 180 కేసులు నమోదయ్యాయని, నాదెండ్ల ఎంపీపీ రాణి భర్త తలతోటి రత్తయ్య మండిపడ్డారు.
నాడు చిలకలూరి పేట వైసీపీ మొక్కగా వచ్చిన విడుదల రజని, జగన్ మద్దతుతో పార్టీ బలంతో ఒక మహా వృక్షం మాదిరి మారి కింద స్థాయి నాయకులను ఎదగనివ్వడం లేదనే ఆవేదన అక్కడి వైసీపీ శ్రేణులలో బలంగా పాతుకుపోయింది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వైసీపీ క్యాడర్ రాజకీయంగా ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి అనే ఆక్రోశం ప్రతి ఒక్కరిలో కట్టలు తెంచుకుంటుంది.
నియోజకవర్గ ఇంచార్జ్ గా పార్టీ కోసం కష్టపడిన అనేకమంది కార్యకర్తలను, కింద స్థాయి నాయకులను గుర్తించి గౌరవించాల్సిన రజని వారిని కేసులతో వేధించింది, రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేసింది, జగనన్న ముద్దు రజని వద్దు అనే నినాదంతో మనంత ఏకమవుదాం అంటూ ఈ సమావేశంలో రజని వ్యతిరేఖ వైసీపీ వర్గమంతా తీర్మానం చేసుకున్నారు.
అయితే తమ ఈ ఆవేదనను పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే భావన అక్కడి నేతలలో, క్యాడర్ లో బలంగా పేరుకుపోవడంతో చిలకలూరి పేట వైసీపీ లో మంట మొదలయ్యింది. మరి ఆ మంట పార్టీ అధిష్టానాన్ని కరిగిస్తుందా.? రజనీని చిలకలూరి పేట నుంచి కదలిస్తుందా.? అనేది చూడాలి.






