వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరూ ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్లే మాట్లాడుతుంటారు. కానీ వారి ఆలోచనలు, చేతలు, వ్యవహార శైలి ప్రతీదీ కూడా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన్నట్లు ఉంటాయని అందరికీ తెలుసు.
ఇదే విషయం టిడిపి, జనసేన నేతలో లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి చెపితే వైసీపి చేతిలో ‘ఎల్లో పెయింట్’, దాంతో వాటిని కవర్ చేసుకొనే వెసులుబాటు ఉండనే ఉంది.
కానీ నిన్న మొన్నటివరకు ‘మా జగనన్న దేవుడు…’ అంటూ భజన చేసినవారే, టికెట్లు దొరక్క బయటకు రాగానే, ‘ఇంతకాలం మేము మా జగనన్నని ఒక్కవైపే చూపాము… ఇప్పుడు రెండో వైపు కూడా చూడండి…’ అంటూ చూపుతుంటే ‘రాముడు పైకి కనిపించే అంత మంచి బాలుడు’ కాడని సామాన్య ప్రజలకు సైతం అర్దమవుతోంది.
వైసీపి సీనియర్ నాయకులలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఒకరు. కానీ ఈసారి ఆయనకు జగన్ టికెట్ నిరాకరించి, సర్నాల తిరుపతిరావు యాదవ్కి అవకాశం కల్పించారు. ఇది ఊహించిందే కనుక ఆయనేమీ షాక్ అవలేదు. కానీ వస్తూవస్తూ జగన్ గురించే మరో నాలుగు కొత్త ముక్కలు చెప్పి మరీ బయటకు వచ్చేశారు.
వైసీపిలో టికెట్లు, మంత్రి పదవులకు కులమతాలు, పనితీరు, ప్రజాధరణ, విధేయత ప్రాధమిక అర్హతలని అందరూ భావిస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను తిట్టడమే ప్రాధమిక అర్హత అని వైసీపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పేశారు.
తాను జగన్మోహన్ రెడ్డిని కలిసి టికెట్ గురించి అడిగితే, “వాళ్ళు ముగ్గురినీ నువ్వు తిట్టవు… నిన్ను ఏవిదంగా ఓన్ చేసుకోగలను?” అని ఎదురు ప్రశ్నించారని చెప్పారు.
కర్రలు కత్తులు పట్టుకుని, వైసీపి కార్యకర్తలను వెంటపెట్టుకుని ఊళ్ళో ప్రతిపక్ష నేతలు, వారి ఇళ్ళు, వాహనాలు, కార్యాలయాలపై దాడి చేసేవారే పార్టీలో సమర్ధులు, టికెట్లు, పదవులకు అర్హులుగా పరిగణింపబడతారని, కానీ తాను ఆవిదంగా చేయలేను కనుక అసమర్ధుడు, పనికిరానివాడిగా భావించి జగన్ పక్కన పెట్టేశారని వైసీపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పేశారు.
కనుక ఆ ప్రాధమిక అర్హతలు కలిగినవారిని గుర్తించి టికెట్స్ ఇవ్వడానికే వైసీపిలో అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందేమో?




