రాజ్యసభ ఖాళీలకు జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అంతటితో ఆగని సాయి, తన సతీమణి సునందారెడ్డిని అసెంబ్లీకి తీసుకొచ్చి మరీ ఆమెతో మరో నామినేషన్ దాఖలు చేయించారు. వెరసి తనతో పాటు తన సతీమణిని రాజ్యసభ బరిలోకి దించారు జగన్ విధేయుడు.
అయితే భార్యతో నామినేషన్ వేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగిన మీదట… పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో విజయసాయిరెడ్డి ఏ-2 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులన్నీ ఇంకా కోర్టుల్లో వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. ఏ ఒక్క కేసులోనూ తుది తీర్పు వెలువడలేదు. అంటే ఒకవేళ తప్పు జరిగినా… విజయసాయి తుది తీర్పు వెలువడే దాకా నిందితుడిగానే లెక్క, దోషి మాత్రం కాదు.
అసలే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు… ఈ కేసులు ఎక్కడ ఇబ్బంది పెడతాయోనన్న భావనతోనే విజయసాయిరెడ్డి తన భార్యతో డమ్మీ నామినేషన్ వేయించినట్లుగా సమాచారం. అయితే సాయిరెడ్డి నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పడం, నాలుగు సీట్లకు బరిలో నలుగురు మాత్రమే నిలిచిన నేపథ్యంలో సునందారెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.



