ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సాగర నగరం విశాఖకు చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీ విశాఖ నగర శాఖలో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు ఉదయం టీడీపీ సీనియర్ నేత, ఏపీ మావన వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.
గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, ఈ క్రమంలోనే దొరబాబు మంత్రి గంటాతో భేటీ అయినట్లు పొలిటికల్ వర్గాల సమాచారం. వైసీపీని వీడి టీడీపీలో చేరతానని గంటా ముందు డిప్యూటీ మేయర్ దొరబాబు ఓ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ముందుగానే దొరబాబు టీడీపీ నేతలతో భేటీ అయ్యారని, టీడీపీలోకి మారే విషయంలోనూ ఆ పార్టీ నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఎయిర్ ఫోర్స్ బాధితులను పరామర్శించడం అంటే… ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రాజకీయాలలో వేడిని రాజేయడమే. పేరుకు పరామర్శ అయినప్పటికీ… జగన్ రాజకీయాలను అనుసరించే వారికి, వైసీపీ అధినేత ఏం చేయబోయేది ముందే అంచనా వేయగలిగే విషయమే. బహుశా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ… చంద్రబాబుని విమర్శించి, నష్టపరిహారం మరింత ఇవ్వాలని చెప్పడం తప్ప… జగన్ చేసేదేమీ ఉండదన్న విషయం రాజకీయ విజ్ఞులకు విదితమే.
అయితే, జగన్ రాజకీయ వేడిని రగల్చక ముందే… ఊహించని కౌంటర్ పడిందని… విశాఖకు బయలు దేరదామని అడుగు బయట పెట్టకముందే వైసీపీ అధినేతకు దొరబాబు రూపంలో టిడిపి ఝలక్కించ్చిందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బాధిత కుటుంబాలను పరామర్శించే పనిలో ఉన్నారు ఈ ‘యువనేత.’



