ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు తీసుకొన్న ఏ నిర్ణయాలను ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా సమర్ధించిన దాఖలాలు కనబడవు. అది మూడు రాజధానులైనా…. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా వైసీపి ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రంలోని పార్టీలే కాకుండా ఇతర రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.
ప్రధాని మోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతి రాజధానిని పక్కన పడేయటాన్ని ఏపీ బీజేపీ, వామపక్షాలు కూడా తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. విశాఖ రాజధాని అని చెప్పినప్పుడు విశాఖ ప్రజలు ఉలిక్కిపడ్డారే తప్ప తాము అడగకుండానే రాజధాని అవుతోందని ఎవరూ సంబరాలు చేసుకోలేదు.
సంక్షేమ పధకాల కోసం అప్పులు చేస్తూ ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపడం సరికాదని ప్రతిపక్ష పార్టీలన్నీ వాదిస్తున్నాయి. పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలను తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేయాల్సిన వైసీపి ప్రభుత్వం ఉన్నవాటినే పారిపోయేలా చేస్తోందని విమర్శిస్తున్నా వైసీపి ప్రభుత్వం పట్టించుకోలేదు.
చంద్రబాబు నాయుడుపై కక్షతో అమరావతిని పక్కన పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి జైలులో వేసి కక్ష సాధించడం సరికాదని చంద్రబాబు నాయుడుతో విభేదించేవారు కూడా హితవు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దేశవిదేశాలలో ఐటి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
ప్రతీ విషయంలోను ఇంతమంది తమను, తమ ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోకుండా, వైసీపి ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వ్యవహరిస్తోంది. పైగా తన ధోరణిని గట్టిగా సమర్ధించుకొంటూ, హితవు చెప్పినవారిపైనే బురద జల్లే ప్రయత్నం చేస్తుండటం శోచనీయం.
జగన్ ధోరణి వలన ఆయన ఒక్కరే నష్టపోయినా లేదా వైసీపి, దాని నేతలు నష్టపోతే అది వారి ఖర్మ అని విస్మరించవచ్చు. కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు కూడా నష్టపోతున్నారు. వైసీపి నేతలు ఇది గ్రహించలేనంత అమాయకులేమీ కారు అయినా తమ ధోరణిలోనే ముందుకు సాగిపోతున్నారు. మరి దీని పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతున్నాయో ఎన్నికలు జరిగితే కానీ తెలియదు. అంతవరకు వైసీపి నేతలతో సహా అందరూ ఓపిక పట్టక తప్పదు.



