నాడు అన్న… నేడు చెల్లి మమ్మల్ని రోడ్డున పడేశారు

YSRTP Leaders Fault YS Sharmila

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడంతో మూడేళ్ళుగా ఆమె వెంట తిరుగుతున్న నాయకులు షాక్ అయ్యారు. ఇవాళ్ళ వారందరూ హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి, పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారు వైఎస్ షర్మిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఆనాడు ఆమె అన్న జగన్మోహన్‌ రెడ్డి ఇలాగే తనను నమ్మివచ్చిన వారినందరినీ నడిరోడ్డుపై విడిచి పెట్టి ఆంధ్రాకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అలాగే వ్యవహరించి మా అందరినీ ముంచేశారు. ఇంతకాలం వైఎస్ షర్మిల తన సొంత అజెండాతోనే పార్టీని నడిపించారు. తన స్వార్ధమే చూసుకొని పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు. ఏనాడూ మా అభిప్రాయాలు అడిగి తెలుసుకోలేదు.

ADVERTISEMENT

ఏ పార్టీ అయినా ఇతర పార్టీలు అడిగితే, తమకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తే మద్దతు ఇస్తాయి. మమ్మల్ని కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఏ పార్టీ కూడా మద్దతు అడగలేదు. కానీ వైఎస్ షర్మిలే కాంగ్రెస్‌లో మా పార్టీని విలీనం చేసేస్తానని వెంటపడి తిరిగారు. కానీ ఛీకొట్టించుకొన్నారు. అయినా ఏమాత్రం సిగ్గులేకుండా ఆ కాంగ్రెస్ పార్టీకే బేషరతుగా మద్దతు ప్రకటించారు.

ఇటువంటి పార్టీ, ఇటువంటి స్వార్ధపూరిత నాయకురాలిని నమ్మి ఇన్నేళ్ళు వెంట తిరగడం మాదే బుద్ధి తక్కువ. కనుక ఇప్పుడే ఈ క్షణమే మేమందరం వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేసేస్తున్నాము. మేము వైఎస్ షర్మిల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలకు చాలా హామీలు ఇచ్చాం. కానీ అవన్నీ నెరవేర్చలేకపోతున్నాము. కనుక మా అందరినీ క్షమించమని ప్రజలను వేడుకొంటున్నాము. ఇకపై వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ పోటీ చేసినా మేమే ఆమెను ఓడిస్తాం. త్వరలోనే మా కార్యాచరణ ప్రకటిస్తాము,” అని అన్నారు.

పార్టీ ముఖ్యనేతలు నేడు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు కనుక తెలంగాణలో వైఎస్సార్ టిపి దుకాణం మూతపడిన్నట్లే. కనుక ఇప్పుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోకపోవచ్చు. రాష్ట్రం, ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం సొంత అజెండాతో పార్టీని స్థాపించి నడిపించాలనుకొంటే వాటి కధ చివరికి ఈవిదంగానే ముగుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories