‘ప్రత్యేక హోదా’ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రత్యేక ప్యాకేజ్’ను అంగీకరించిన మరుక్షణం, ‘స్పెషల్ స్టేటస్’పై అమాంతమైన ప్రేమ పుట్టుకొచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘యువభేరి’ పేర్లతో రాష్ట్రంలోని వివిధ కాలేజీలలో సభలు నిర్వహిస్తున్న వైనం తెలిసిందే. తాజాగా కర్నూల్ లో ఏర్పాటు చేసిన సభలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు గుప్పించిన జగన్, విద్యార్ధులలో ప్రభుత్వ వ్యతిరేక భావన ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేసారు.
అయితే ఓ పక్కన జగన్ ఆగ్రహాపూరితమైన ప్రసంగాలు చేస్తుంటే… మరో పక్కన విద్యార్ధులు గ్రౌండ్ లో కబడ్డీ ఆటలు ఆడుకోవడం గమనార్హం. ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని లైట్ గా తీసుకున్నారో లేక జగన్ రొటీన్ స్పీచ్ లను తేలికగా తీసుకున్నారో గానీ.., ‘జగన్ ప్రసంగం – విద్యార్ధుల ఆటలకు’ సంబంధించిన వీడియోలను మీడియా వర్గాలు ప్రసారం చేసాయి. అయితే జగన్ సమావేశం ఉందని తెలిసి కూడా కాలేజ్ యాజమాన్యం సదరు విద్యార్ధులను లోపలికి వెళ్ళాలని ఆదేశించకపోవడం, అలాగే వైసీపీ వర్గాలు కూడా విద్యార్ధులను జగన్ ప్రసంగం వద్దకు తీసుకువెళ్ళడానికి ఆసక్తి కనపరచకపోవడం ఆసక్తికరమైన విషయం.
ఇదిలా ఉంటే… జగన్ ప్రసంగాలు రాజకీయ సభల మాదిరి తయారవుతున్నాయి గానీ, నిజంగా ‘ప్రత్యేక హోదా’ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో విద్యార్ధులకు తెలియజెప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బహుశా ఈ రాజకీయ ప్రసంగాలను వినడానికి విద్యార్ధులకు ఆసక్తి లేకనే, కాలేజీ ఆవరణలో ఆటలు ఆడుకుంటున్నారేమో అన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా… జగన్ ‘యువభేరి’లు సరైన ప్రాధాన్యత దక్కించుకోవడంలో విఫలమవుతున్నాయి.



