రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో కొన్ని పరిణామాలు ఇంచుమించు ఒకేలా సాగుతుండటం ఆసక్తికరంగా ఉంది.
వైసీపీ హయంలో రాజధాని అమరావతికి, పోలవరానికి బ్రేకులు వేసి నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తే నాడు ఆంధ్రా ప్రజలు, వాటిని పరుగులు పెట్టించిన సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపి నేతలు చాలా ఆవేదన చెందారు. అప్పుడు ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణకు తరలిపోతుంటే మౌనంగా అందరూ బాధ పడ్డారు.
ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు సరిగ్గా అటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగించకుండా పక్కన పెట్టడంతో నీళ్ళు అందక రైతులు ఎలాగూ ఇబ్బందులు పడతారు. వారి కంటే దానిని ప్రతిష్టాత్మకం భావించి నిర్మించిన బీఆర్ఎస్ నేతలు చాలా ఆవేదన చెందుతున్నారు. ఇందుకు హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించని రోజు లేదు.
అలాగే హైదరాబాద్ మెట్రోని శంషాబాద్ విమానాశ్రయంతో కలిపేందుకు కేసీఆర్ సర్వం సిద్ధం చేస్తే, రేవంత్ రెడ్డి దానినీ పక్కన పడేశారని కేటీఆర్ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడంలో, నదీ జలాలను సమర్ధంగా వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతుంటే, తెలంగాణ ప్రభుత్వం వెనకబడిపోయిందని బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారు.
అమరావతి విషయంలో మాజీ సిఎం జగన్కి, కాళేశ్వరం, మెట్రో ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. కానీ వాటి వలన రాష్ట్రానికి నష్టం కలిగిందనేది వాస్తవం.
నాడు జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పరోక్షంగా తోడ్పడి అమరావతికి బ్రేకులు పడేలా చేసినప్పుడు, ఆంధ్రా ప్రజలు ఏవిధంగా బాధపడ్డారో, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు కూడా అదేవిధంగా బాధపడుతున్నారు. కనుక ఆంధ్రా ప్రజల బాధ ఇప్పుడు వారికీ అర్ధమయ్యే ఉంటుంది.



