ఒకట్రెండు పాములు ఒకే చోట కనిపిస్తేనే బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో… తమిళనాడులోని ఓ కర్మాగారం పరిసరాల్లో ఏకంగా వెయ్యి పాములను పట్టుకోవడం కలకలం రేపుతోంది. చెన్నై దగ్గర్లో గల మధురాంతకంలో పట్టాలం అనే ప్రాంతంలో పురాతనమైన సహకార షుగర్ ఫ్యాక్టరీ వుంది. ఆ కర్మాగారంలో కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. 20 ఎకరాల్లో నిర్మించిన ఈ కర్మాగారం చుట్టూ పచ్చిక బయళ్లు, చెట్లు ఉండడంతో నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది.
ఈ కర్మాగారంలో తాజాగా కర్మాగారం లోపల, బయట ఎక్కడ చూసినా పాములే పాములు… దీంతో యాజమాన్యం అటవీశాఖ సిబ్బంది, పాములు పట్టేవారిని రంగంలోకి దించింది. దాదాపు 10 మందితో కూడిన బృందం రెండు రోజుల్లో ఏకంగా వెయ్యి పాములను పట్టుకుని గోనెసంచుల్లో కట్టేశారు. వీటిలో రకరకాల జాతులకు చెందిన సర్పాలు ఉన్నాయని, విష సర్పాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. వీటన్నింటినీ రైల్లో తీసుకెళ్లి సుదూర అడవుల్లో విడిచి పెడతామని అటవీశాఖాధికారులు తెలిపారు.
దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ షుగర్ ఫ్యాక్టరీ కొన్ని సంవత్సరాల క్రితం మూతపడింది. కాగా, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరేళ్ళుగా మళ్ళీ ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో పాముల భయం కాస్త ఉన్నప్పటికీ, ఇలా ఒక్కసారిగా 1000 పాములు పట్టుకోవడమనేది కార్మికులలో భయాందోళనలను పుట్టిస్తోంది.



