చైనాలో కనుగొన్న ఓ మమ్మీ పురావస్తు శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. ఆ మమ్మీని చూసి శాస్త్రవేత్తలే అవాక్కవుతున్నారు. దానికి కారణం, సమాధి చేయబడ్డ ఆ మహిళ మమ్మీ రెండు వేల సంవత్సరాల క్రితంది అయినప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదరక పోవడం. ఆమె శరీరం అలా చెడిపోకుండా ఉండేందుకు ఎలాంటి లేపనాలు వాడారు? అన్నది శాస్త్రవేత్తలకు అంతపట్టని మిస్టరీగా మారింది.
సాధారణంగా మరణించిన తరువాత ఆ మృతదేహానికి ఎంతటి రసాయనాలు పూసి భద్రపరిచినా చర్మం, ఇతర శరీర భాగాలు నెమ్మదిగా అంతరిస్తాయి. చివరికి కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. వాటికి భిన్నంగా ఈ మమ్మీ శరీరం మాత్రం చెడిపోలేదు సరికదా, చర్మం రబ్బరులా సాగుతోంది. అయితే ముఖం మాత్రమే గుర్తు పట్టలేని విధంగా మారడం మరో విశేషం. ఒక్క ముఖంలో మార్పు రావడం, ఇతర భాగాలన్నీ రబ్బరులా సాగడం శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది.
అసలు ఆమె శరీరాన్ని అలా భద్రపరిచేందుకు వాడిన రసాయనాలు, లేపనాల విషయం తేల్చేందుకు చాలా కాలంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిశోధనలు సాగుతున్నప్పటికీ ఆమె శరీరాన్ని భద్రపరిచేందుకు ఎలాంటి రసాయనాలు పూశారన్నది కనుక్కోలేకపోయారు. ఆమె ఊబకాయురాలై ఉంటుందని, ఆమె శరీరంలో పుచ్చకాయ గింజలను గుర్తించడంతో, బహుశా మరణించే ముందు పుచ్చకాయ తిని ఉంటుందని గుర్తించారు. అలాగే ఆమె గుండెపోటుతో మరణించి ఉండచ్చని అంచనా వేస్తున్నారు.



