2024 ఫలితాలు: జగన్ కు మాత్రమే కాదు..

2024 Election Results: Not Only For Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది గడిచింది. అయితే నాడు కూటమి vs వైసీపీ గా సాగిన రాజకీయ కురుక్షేత్రంలో జగన్ చెప్పినట్టుగా ధర్మమే నెగ్గింది, అధర్మమే ఓడింది అని ప్రజా తీర్పుతో రుజువయ్యింది.

అయితే 2019 నుంచి 2024 వరకు 151 సీట్లతో అధికారాన్ని అందుకున్న జగన్, అందుకు ప్రతిగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు దూరంగా, విధ్వంసానికి దగ్గరగా చేసారు. దాని ఫలితమే 2024 ఎన్నికలలో వైసీపీ 11 స్థానాలకు పరిమితమయ్యింది.

ADVERTISEMENT

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నిరంకుశ పాలన సాగింది. నాటి ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పితే శుక్రవారం అరెస్టులు, అరికాళ్ళ కోటింగ్లు, కార్యాలయాల మీద దాడులు అనేది రాష్ట్రంలో సర్వసాధారణంగా సాగిపోయాయి.

టీడీపీ జెండా మోసే పసుపు కార్యకర్తకు బెదిరింపులు, అవమానాలు, జనసేన పేరు వినిపించిన జనసైనికులకు ఛీత్కారాలు, చీదరింపులు అన్నట్టుగా వైసీపీ పాలన నడిచింది. అయితే బటన్లు నొక్కాం…ఇక ఓట్లన్నీ వైసీపీ ఖాతాలోనే అనే భ్రమలో ఉన్న వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

ప్రభుత్వం అంటే సంక్షేమ బటన్లు నొక్కడమే కాదు, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచగలగాలి. వందలమంది సలహాదారులను నియమించుకుని ప్రభుత్వాన్ని నడపడం, వేలమంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని పాలన చేయడం, ప్రశ్నించిన వారి పై కేసులు, నిలదీసిన వారి పై దాడులు చేస్తూ మోనార్క్ మాదిరి వ్యవహరించిన వైసీపీ చివరికి ముఖం చూపించలేని విధంగా ప్రజల నుంచి తిరస్కరణను రుచి చూసింది.

నాడు విజయ గర్వంతో ఐదేళ్లు తలెగరేసిన వైసీపీ నేడు ఓటమి భారంతో ఐదేళ్లు కళ్ళు మూసుకోవడానికి సిద్దపడింది. అలాగే తన అధికారంతో ప్రత్యర్థి నాయకుల కంట కన్నీరు తెప్పించిన జగన్ నేడు ఎన్నికల ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకొచ్చి ఒకరకంగా ఏడ్చేసినంత పనిచేసారు.

వచ్చిన ఒక్క ఛాన్స్ ను కక్ష్య రాజకీయాలతో వికట్టాటహాసం చేసిన వైసీపీ దేశ రాజకీయాలలో తనదైన గుర్తింపు దక్కించుకున్న చంద్రబాబును సైతం తమ కబంద హస్తాలలో బంధించి దాదాపు అరవై రోజుల పాటు జైలు లో నిర్బంధించారు. అలాగే అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఆయన భార్య భువనేశ్వరి అసెంబ్లీ సాక్షిగా అవమానాలను ఎదుర్కొన్నారు.

ఇక పవన్ కళ్యాణ్, లోకేష్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ శపధాలు చేసారు వైసీపీ ముఖ్యనేతలు. మరో 30 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం మాదే, వై నాట్ 175, ప్రతిపక్షం లేని ప్రభుత్వం వైసీపీ లక్ష్యం అంటూ విర్రవీగిన వైసీపీ ని ఇటు ప్రజలు కూడా అదే భ్రమలో ఉంచి చివరికి తమ ఓటు అనే ఆయుధం తో చావు దెబ్బ కొట్టారు.

ఉచితాలతో ప్రజలను సంతృప్తి పరచలేరని, మితిమీరిన రాజకీయం, హద్దులు దాటిన విమర్శలను ప్రజలు అంగీకరించరని, అలాగే నియంత నాయకత్వానికి ఓటమి తప్పదని 2024 ఏపీ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేసాయి. నాటి ఫలితాలు ఒక్క జగన్ కు మాత్రమే కాదు అందరి రాజకీయ నాయకులకు ఒక పాఠమనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories