దసరా నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. 11వ తేదీన ఉదయం సరిగ్గా 11:13 గంటలకు అన్ని జిల్లా కార్యాలయాల్లో బాధ్యతలు అప్పగించిన మంత్రులు జెండాలను ఎగురవేయడంతో, కొత్త జిల్లాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికారుల కేటాయింపులకు సంబంధించి 300కు పైగా జీవోలు ఒక్క దసరా నాడే ఉదయం విడుదల కానున్నాయి. వీటిల్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారుల నియామకాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
తాత్కాలిక అధికారుల కేటాయింపులో భాగంగా ఆర్డర్ టు సర్వ్ విధానంలో నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. ముందుగానే మౌఖిక ఆదేశాలు అందుకునే అధికారులు, తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లనున్నారు. జెండా ఆవిష్కరణల అనంతరం ప్రతి జిల్లాలోనూ పోలీసు పరేడ్ జరగనుంది. కొత్త జిల్లాల్లో భాగంగా బదిలీ కానున్న వారికి తక్షణమే రిలీవ్ చేసేలా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొత్తగా ఏర్పడనున్న మండలాలకు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ, ఓఎస్డీలు, ఎంఈఓలను పంచాయతీ రాజ్, విద్యా, వ్యవసాయ శాఖలు నియమించనున్నాయి.



