ఇలా అయితే షర్మిల రాజకీయం ఏపీలో కూడా ముగిసిన అధ్యాయమేనా.?

YS Sharmila at a political meeting

అన్నవదిలిన బాణంలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరమీద మెరిసిన షర్మిల 2019 వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అటు తరువాత అన్నతో వచ్చిన కుటుంబ విభేదాలు, రాజకీయ వైషమ్యాలు కారణంగా టి.వైఎస్ఆర్ సిపి పేరుతో తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టారు షర్మిల.

అయితే అన్న వదిలిన బాణంలా ఏపీలో పాదయాత్ర చేసిన షర్మిల, అన్న వదిలించుకున్న బాణంలా తెలంగాణలో కూడా పాదయాత్ర తోనే తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. కానీ తెలంగాణ రాజకీయాలలో టి. వైసీపీ పాత్ర శూన్యమని తేలడంతో తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు షర్మిల.

ADVERTISEMENT

అలా తెలంగాణ రాజకీయాలలో ముగిసిన అధ్యాయంగా ఏపీకి వచ్చిన షర్మిల అన్న జగన్ మీద రాజకీయ యుద్ధం ప్రకటించింది. వైసీపీ ఓటమే తన లక్ష్యం అన్నట్టుగా సాగిన షర్మిల రాజకీయం 2024 ఎన్నికల తరువాత అంచలంచెలుగా కనుమరుగవుతూ వస్తుంది.

అసలు ఏపీలో కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీ ఉందని, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో షర్మిల రాజకీయం చేస్తుందనే విషయాన్నే ఏపీ ప్రజలు మరచిపోయే స్థాయికి షర్మిల గొంతు మూగబోయింది. జన్మకో శివరాత్రి అన్నట్టుగా సాగుతున్న షర్మిల పొలిటికల్ పర్యటనలు అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు షర్మిలకు కానీ ఎటువంటి పొలిటికల్ మైలేజ్ ఇవ్వలేకపోతున్నాయి.

షర్మిల రాజకీయం ఎదో అడపాదప, ఆట విడుపుగా చేస్తున్నట్టుగా సాగుతున్నాయే కానీ అందులో ఒక లక్ష్యం, ఒక రాజకీయ సిద్ధాంతం ఉన్నట్టుగా ముందుకెళ్లడం లేదు. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ లో షర్మిల ను మినహాయిస్తే మరో నేత కనిపించడం లేదు.

ఇటు రాజకీయ నాయకులను అటు ప్రజలను కూడా తనవైపు ఆకర్షించుకోలేకపోతున్న షర్మిల రాజకీయం ఇలానే కొనసాగితే ఏపీలో కూడా షర్మిల పొలిటికల్ జర్నీ ముగిసిన అధ్యాయమే అవుతుందేమో బహుశా..!

 

ADVERTISEMENT
Latest Stories