
మొన్న ఒక ఇంటర్వ్యూలో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పి బాధ పడ్డారని పవన్ కళ్యాణ్ చెప్పారు. నిన్న కొంత మంది జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట చెప్పారు. పైగా చాలా మంది ఎమ్మెల్యేల వారసులు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇది కొంత ఆశ్చర్యపరిచేదే. ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో టీడీపీ నుండి ఎందరో సీనియర్ కాపు నాయకులు ఆ పార్టీలోకి వెళ్లి చాలా కోల్పోయారు. కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటివారి రాజకీయ జీవితమే దాదాపుగా ముగిసిపోయింది. ఆ అనుభవంతో పవన్ కళ్యాణ్ కు మద్దత్తు పలికేవారు ఎవరు అనేది అనుమానమే.
మరోపక్క రాజకీయాల్లోకి కొత్త రక్తం తీసుకొస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసేన మొదటి నాయకుల ప్రెస్ మీట్ లో బీజేపీ నుండి తెచ్చుకున్న శ్రీధర్ అడ్డేపల్లి ని కూర్చోబెట్టారు. ఇప్పుడు టీడీపీ నుండి ఎమ్మెల్యేలను లాగి వాళ్ళకు టిక్కెట్లు ఇస్తారేమో? ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్ చిరంజీవి పంథాలో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది.
ఇటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ వారికే రుచించడం లేదు. మరి పవన్ కళ్యాణ్ మదిలో ఏముందో మరి. అప్పట్లో పక్క పార్టీ నుండి తెచ్చుకున్న వారే తన అన్నయ్యకు అన్యాయం చేసారని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు. మరి ఇప్పుడు అదే పని చేస్తే జనసేనకు కూడా ముప్పే కదా?



