నార్త్ ఇండియాలో ఎక్కువగా వినిపించే మత రాజకీయాలు ఇప్పుడు సౌత్ ను తాకాయా అనేలా ఇక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. లోకికవాదం పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు దేవాలయాల మీద, దేవతా విగ్రహాల మీద దాడులకు తెగబడుతూ మత విద్వేషాలు రెచ్చకొట్టే ప్రయత్నాలకు ఊతమిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో మొదలైన ఈ విష సంస్కృతి ఇప్పటికి కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించాలి. రోజురోజుకి హిందూ దేవాలయాల మీద దాడులు పెట్రేగిపోతున్నాయి. మొన్న తెలంగాణలో దసరా శరన్నవరాత్రుల వేడుకలలో అమ్మవారి విగ్రహాల మీద జరిగిన అకృత్యాలు ఇంకా మరువక ముందే ఇప్పుడు ఏపీలో ఆంజనేయ స్వామి దేవాలయం మీద దాడి.
చిత్తూరు జిల్లా మొలకల చెరువులో శ్రీఅభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. దీనితో స్థానిక ప్రజలు ఈ చర్యల మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిత్యం హిందూ దేవాలయాల మీద ఏదోఒక దాడితో హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని, ప్రభుత్వాలు కూడా ఇటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శను ఎదురుక్కుంటుంది.
అయితే ఈ సంఘటన మీద స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం తాలూకా వచ్చిన బలం వీరికి ఇప్పటికి ప్రభుత్వాల పట్ల భయాన్ని, నాయకుల పట్ల గౌరవాన్ని పుట్టించలేకపోతున్నాయి.
హిందూ ధర్మ పరిరక్షణ అంటూ ఎవరైనా తమ గళం విప్పితే వారి పై మత రాజకీయాలు చేస్తున్నారు అంటూ నిందలు వేసే నాయకులు, జస్ట్ అస్కింగ్ అంటూ ప్రశ్నించే మేధావులు ఇప్పుడు ఇటువంటి సంఘటనలు మీద జస్ట్ అస్కింగ్ అంటూ ఎవరిని ప్రశ్నించలేకపోతున్నారా.? ఎవరి మీద నిందలు వేయలేకపోతున్నారా.? అంటూ ధర్మాన్ని నమ్మే ప్రతిఒక్కరు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ కారణాలతో ఈ దాడులకు పాల్పడుతున్నారా.? లేక హిందూ మతం మీద ఉన్న వ్యతిరేకతతో ఈ సాహసాలకు ఒడిగడుతున్నారా.? అనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అధికారులను ఎలర్ట్ చేసి ఈ దాడులను ఇక్కడితో అరికట్టకపోతే అవి చివరికి మత ఘర్షణలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు.
ఎవరి అండ చూసుకుని ఈ అరాచక శక్తులు హద్దులు దాటుతున్నాయో, ఎవరి ప్రోద్బలంతో ఇంతటి దారుణాలకు తెగబడుతున్నారో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత, వారికీ కఠిన శిక్షలు విధించాల్సిన ధర్మం అత్యున్నత పదవులలో ఉన్న నాయకులదే అనేది గ్రహించి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకొని ఈ విష సంస్కృతికి ఇకనైనా సమాధి కట్టాలి.
రాజకీయాలు ప్రత్యర్థి పార్టీలను, ప్రత్యర్థి రాజకీయ నాయకులను దాటి ఇప్పుడు హిందూ దేవాలయాలను తాకాయా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హద్దులు దాటిన అరాచకం ఎప్పటికైనా విధ్వంసాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఈ దాడులకు తెగబడుతున్న ధైర్యాన్ని ఇక్కడితో అంతమొందించాలని హిందూ మత పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.




