‘ప్రత్యేక హోదా’ ఎవరి పరిధిలో ఉండే అంశం? అన్న ప్రశ్న గనుక స్కూల్ కు వెళ్తున్న చంటి పిల్లాడిని కదిపినా… కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అన్న సమాధానం వ్యక్తం అవుతుంది. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రం… ‘స్పెషల్ స్టేటస్’ ఏపీకి ప్రకటించకపోవడం వెనుక కారణం మాత్రం చంద్రబాబు ఒక్కరే కనపడతారు. అది జగన్ స్పెషాలిటీ కాగా… అసలు ‘ప్రత్యేక హోదా’ను ఎలా డీల్ చేయాలో తెలియని పరిస్థితిలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.
వీరిద్దరూ ఎందుకు ‘ప్రత్యేక హోదా’ అంశంపై కేంద్రాన్ని నిలదీయరని ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ నిలదీశారు. ఎంతసేపటికి చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం ఒక్కటే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని, ఈ విషయంలో అసలు సూత్రధారి అయిన బిజెపిని జగన్ ఎందుకు ప్రశ్నించరని మండిపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా స్పందిస్తూ… కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆవశ్యకత ఉందని, తెలంగాణా ఉద్యమం తరహాలో డీల్ చేస్తే తప్ప ఏపీకి ‘స్పెషల్ స్టేటస్’ రాదని పేర్కొన్నారు.
నాయకులు హోదా కోసం పోరాడితే, ప్రజలు కూడా వారి వెంటే ఉంటారని చెప్పిన శివాజీ వ్యాఖ్యల్లో అర్ధముంది. అయితే ఆ నాయకుడు ఎవరో అని ప్రజలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజలను ఉత్తేజభరితుల్ని చేసి, అహింసా మార్గంలో ఉద్యమం సాగిస్తూ…. ఏపీ నాడి వేడిని కేంద్రానికి తెలిపేలా చేయగల సత్తా ఎవరికి ఉందనేది ప్రశ్నార్ధకమే! అందుకే ఏపీ ప్రజానీకం కూడా ప్రస్తుతం ‘మాకూ ఓ కేసీఆర్ కావాలి’ అంటూ యోచిస్తున్నారు. హింస అయినా, అహింస అయినా అనుకున్న తెలంగాణాను కేసీఆర్ సాధించిన విషయం తెలిసిందే.



