“ఆదిత్య 369” సీక్వెల్ తీసేందుకు కథ సిద్ధంగా ఉందని సినీ దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ‘ఆదిత్య 369’ టాలీవుడ్ లో అద్భుత విజయం సాధించడం మాత్రమే కాదు, అందరి చేత ‘ఔరా’ అనిపించింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన మూలకథతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచింది.
ఒకప్పుడు విఠలాచార్య సినిమాలలో మాత్రమే సాంకేతికతను చూసిన తెలుగు ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు సరికొత్త సాంకేతిక అనుభూతిని అందజేశారు. ఈ సినిమాకు సీక్వెల్ రాసుకున్నానని, దానిలో కూడా బాలయ్య మాత్రమే నటించాలని అన్నారు. బాలయ్య ఎప్పుడు సరే అంటే అప్పుడు షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా ఓ ప్రకటన చేసారు.
ఈ సినిమా ద్వారా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే విధంగా కథను సిద్ధం చేశానని, తన కథ ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతినిస్తుందని సింగీతం చెప్పిన విశేషాలు బాలయ్య అభిమానులను ఆకర్షిస్తున్నాయి. లెజెండరీ దర్శకుల జాబితాలో సింగీతం పేరు ఎల్లకాలం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే నాటి దిగ్గజ దర్శకుడు నేటితరం ప్రేక్షకులను కూడా మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కించగలరా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే!



