తెలంగాణ కు హైద్రాబాద్ ఆయువు పట్టయితే హైద్రాబాద్ కు పాతబస్తీ మూలధరంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పాతబస్తీలో బస్తీమే సవాల్ అంటూ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టగల సత్తా మాత్రం MIM సొంతమనే చెప్పాలి.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మిత్ర పక్షంగా మారిపోయి ప్రభుత్వంలో తాము పరోక్ష భాగస్వాములమే అనేలా వ్యవరిస్తుంది MIM . గత పదేళ్లు అధికార బిఆర్ఎస్ కు వంత పాడిన MIM ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు.
అలాగే ఆ పార్టీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బిఆర్ఎస్ నాయకుల జాతకాలన్ని తనవద్ద భద్రంగా ఉన్నాయని, అవి బయటకు వస్తే ఆ నేతలెవ్వరూ బయటపడలేరని ఒవైసీ బిఆర్ఎస్ పార్టీ ఊహించలేని విమర్శలు చేసారు ఒవైసీ.
మూసీ సుందరీకరణకు బిఆర్ఎస్ చేసిందేమి లేదని, ఇప్పుడు మాత్రం కేసీఆర్ హయాంలోనే మూసీ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అంటూ కాకమ్మ కబుర్లు చూపుతున్నారన్నారు. అలాగే తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయిందనే బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలను కూడా తోసిపుచ్చారు ఒవైసీ.
మొన్నటిదాకా బిఆర్ఎస్ తో పరోక్ష బంధం కొనసాగించి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, ఇప్పుడు కాంగ్రెస్ సహకారంతో బిఆర్ఎస్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్న ఒవైసీ ని చూసి ఈయన ‘ఒవైసీ నా ఉసరవల్లా’ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు బిఆర్ఎస్ శ్రేణులు.
అయితే రేవంత్ సర్కార్ తెర మీదకు తెచ్చిన హైడ్రాతో ఒవైసీ కి సంబంధించిన ఆస్తులకు చిక్కులు తప్పవని భావించే ఒవైసీ కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికే బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. పదేళ్ల స్నేహ బంధాన్ని పదవి పోయిన పది నెలలకే పక్కన పెట్టిన నాయకులను ప్రభుత్వాలు ఇలా వెనకేసుకొచ్చినన్ని రోజులు ఇటువంటి వారు రాజకీయ నాయకులుగా కాకుండా ఉసరవల్లి మాదిరే ప్రవరిస్తారు అనేది వాస్తవం.




