ప్రతీ ప్రాణికి చావుపుట్టుకలు తప్పవు… అని మనుషులకే బాగా తెలుసు. మన రాజకీయ నాయకులు ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే భ్రమలో ఉన్నట్లే ఎప్పటికీ జీవించే ఉంటామనే భ్రమతో చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడనివన్నీ చేస్తుంటారు. వారు ఈ భ్రమలో ఉంటూనే చనిపోయిన రాజకీయ నాయకుల జయంతులు, వర్దంతులకు హాజరవుతుంటారు. వారి గురించి ఏవేవో చెపుతుంటారు. కనీసం అప్పుడు కూడా మనకీ ఓ డేట్ వస్తుందని ఎవరూ గ్రహించరు. కనీసం ఆ ఆలోచన కూడా కలుగదు.
కానీ వారికి జ్ఞానోదయం అయ్యేసరికి సమయం మించిపోతుంది. అలాగని రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారని కాదు. కానీ రాజకీయాలను శాశిస్తున్నామని అనుకునేవారు హటాత్తుగా ఎన్నికలలో ఓడిపోయి ఫామ్హౌసు లేదా ప్యాలస్లోనో కూర్చుంటారు. హెలికాఫ్టర్ లేదా విమానా ప్రమాదాలలో మరణిస్తుంటారు. అప్పటి వరకు రాజకీయాలలో చక్రం తిప్పిన నాయకుడు ఒక్కసారిగా ఫోటో ఫ్రేములోకి ఆ తర్వాత విగ్రహాలలోకి మారిపోతుంటారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం పూణే జిల్లా బారామతి వద్ద విమాన దుర్ఘటనలో మృతి చెందారు.
ఆయన నిన్న రాత్రి ముంబయిలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం బారామతిలో జరిగే ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు ముంబాయి నుంచి బయలుదేరారు. బారామతిలో విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు కుప్పకూలిపోయింది. అజిత్ పవార్తో సహా విమానంలో ఉన్న ఆరుగురూ చనిపోయారు!
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, మహారాష్ట్రతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలలో అజిత్ పవార్ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బారామతి నుంచి వరుసగా ఎన్నికవుతున్నారు. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన క్రెడిట్ ఆయన సొంతం.
అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు మేనల్లుడు. రాజకీయాలలో ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉంది ఆయనకి. కానీ ఒక్క విమాన ప్రమాదంతో అయన ఈ లోకం నుంచే నిష్క్రమించారు.
కానీ జీవించి ఉన్నప్పుడే తనకు ఈ పదవులు, హోదా, గౌరవం కల్పించిన బారామతి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ప్రజల చేత ‘దాదా’ (అన్న) అనిపించుకున్నారు. కీర్తిశేషులు అంటే ఇదే కదా?






