ఈరోజు ఉదయం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన సొంత నియోజకవర్గం బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై దేశంలో రాజకీయ నాయకులు అందరూ సంతాపం వ్యక్తం చేస్తుంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ‘కుట్ర జరిగి ఉండవచ్చని’ అనుమానం వ్యక్తం చేశారు.
కోల్కత్తాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “అజిత్ పవార్ (ఎన్సీపీ) మహారాష్ట్రలోని బిజేపి కూటమి నుంచి బయటకు వచ్చేయాలనుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారు. కనుక ఈ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా? అని తేల్చాలి. నాకు సీబీఐతో సహా కేంద్రం అధీనంలో నడిచే ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదు. సుప్రీంకోర్టుని మాత్రమే నమ్ముతాను. కనుక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలి, “ అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
ఆమె ఏదో యధాలాపంగా ఈ సంచలన ఆరోపణ చేయలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పక్కలో బల్లెంలా మారిన బిజేపిని ఇరుకున పెట్టడానికే ఈవిధంగా ఆరోపించి ఉండవచ్చు.
అజిత్ పవార్ బిజేపి కుట్రకు బలైపోయారనే ఆమె వాదనని బలంగా ప్రజలలోకి వెళితే బిజేపికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. పదవి అధికారం చేజిక్కించుకోవడం బిజేపి ఎంతకైనా తెగిస్తుంది అని దేశ ప్రజలు నమ్మితే బిజేపి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ముఖ్యంగా ఎన్సీపీ నేతలకు ఈ అనుమానం కలిగించగలిగితే వారు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పేసే ప్రమాదం ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్-మే మద్యలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కోలీవుడ్ నటుడు విజయ్ టీవీకే పార్టీతో ఆ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. అందుకే ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదల కానీయకుండా సెన్సార్ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పుడీ ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంపై మమతా బెనర్జీ చేస్తున్న ఈ సంచలన ఆరోపణ కూడా తమిళ ప్రజలు నమ్మితే ఆ రాష్ట్రంలో బిజేపి, దానితో పొత్తు పెట్టుకునందుకు అన్నాడీఎంకే రెండూ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.
కనుక మమతా బెనర్జీ ఆరోపణలో వాస్తవం కానప్పటికీ తేలికగా కొట్టి పడేయలేము. బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ ఎంట్రీ ఇస్తే ఇలాగే ఉంటుంది మరి!






