ఏపీ రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో పైసా లేనప్పుడే రాజధాని కోసం 34 వేల ఎకరాలు భూసేకరణ చేసి దూరదృష్టి, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదేది ఉండదని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపారు.
చంద్రబాబు నాయుడు ‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ జగన్లాగ గొప్పలు చెప్పుకోలేదు. కానీ రాజధాని విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు. కానీ జగన్ స్వయంగా ప్రతిపాదించిన మూడు రాజధానులు, విశాఖ రాజధానిలో ఏ ఒక్కటీ ఏర్పాటు చేయలేకపోయారు. కనీసం ఆ మాటకు కూడా అయన కట్టుబడి ఉండలేకపోయారు! చంద్రబాబు, జగన్ ఇద్దరి మద్య తేడా ఇదే.
సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం చేత అమరావతికి రాజముద్ర కూడా వేయించారు. తద్వారా అమరావతికి భవిష్యత్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండబోవని కేంద్రం చేతనే చెప్పించినట్లయింది.
అంతేకాదు… దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సంబంధాలున్నాయని, అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందనే చక్కటి సందేశాన్ని ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి పంపించినట్లయింది.
అమరావతి, రాష్ట్రాభివృద్ధి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుకి ఇంత దూరదృష్టితో, ఇంత స్థిరమైన నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుంటే, వైసీపీ నేతలు ఎవరూ ఇప్పుడు ‘విశాఖ రాజధాని’ అనలేని పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డే కదా? పైగా వారి చేత కూడా ‘మావిగన్’ పాట పాడిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ‘మావిగన్’ బదులు మరో కొత్త ప్రతిపాదన చేసినా ఆశ్చర్యం లేదు.
కనుక రాజధాని పేరుతో చాలా అద్భుతంగా రాజకీయాలు చేస్తున్నానని జగన్ అనుకుంటున్నారే తప్ప ఇలాంటి ఆలోచనలు, మాటలతోనే ప్రజలను దూరం చేసుకుంటున్నానని, వైసీపీకి స్వయంగా సమాధి నిర్మించుకుంతున్నానని గ్రహించడం లేదు.
అధినేత ఆలోచన తప్పైయితే పార్టీ సరిచేయాలి. పార్టీ ఆలోచన తప్పైయితే అధినేత సరిచేయాలి. కానీ అందరూ కలిసి తప్పు చేస్తూ అదే సరైనదని వాదిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? వైసీపీ నేతలు, కార్యకర్తల చేత గట్టిగా ‘మావిగన్’ భజన చేయించినంత మాత్రాన్న ప్రజలు నమ్మేస్తారా? అని తెలుసుకోవడం లేదు.
ఓ పక్క అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు ఇంత స్పష్టతతో ముందుకు సాగుతూ చకచకా రాజధాని నిర్మిస్తుంటే, జగన్ మాత్రం సిఎం చంద్రబాబు నాయుడుపై అసూయతో రోజుకో మాట మాట్లాడుతున్నారు. జగన్ ఈ ధోరణే కూటమికి శ్రీరామరక్ష!
వైసీపీని ఎవరూ ఓడించక్కరలేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓడించుకుంటారు. ఆయనే స్వయంగా వైసీపీకి సమాధి నిర్మించుకుంటున్నారని చెప్పక తప్పదు.




