గత రెండు రోజులుగా దేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరు ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ రాజకీయం నుంచి ఆ రాష్ట్ర రాజధానికి భద్రత కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చెయ్యాల్సి వచ్చింది.
అలాగే ఆ తీర్మానం ఆమోదం కోసం పార్లమెంట్ లో రాజ్యసభలో బిల్లు పెట్టాల్సి వచ్చింది. దీనితో గత ఐదేళ్లు రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ చర్చలో నిలిస్తే తాజాగా రాష్ట్ర రాజధానికి చట్ట భద్రత కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలు చర్చలోకి వచ్చాయి.
అయితే ఈ బిల్లు కు ఆమోద ముద్ర వేయడానికి అటు ఎన్డీయే ప్రత్యర్థి కాంగ్రెస్ ముందుకొచ్చింది, ఇటు వైసీపీ మిత్రపక్షమైన బిఆర్ఎస్ ముందుకొచ్చింది కానీ మేము అమరావతికి వ్యతిరేఖం కాదు అంటూ వాదిస్తున్న వైసీపీ మాత్రం బిల్లును వ్యతిరేకిస్తూ చట్ట సభల నుంచి వాకౌట్ చేసి బయటకెళ్ళింది.
అయితే అమరావతి చట్టబద్ధత విషయంలో వైసీపీ అనుబంధం పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బిఆర్ఎస్ ముందుకురావడం ఇక్కడ కొసమెరుపు. మేము ఎప్పుడు అమరావతి వ్యతిరేకం కాదని నాడు 2015 అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాల్గొన్నారని ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గుర్తు చేసారు.
తెలంగాణ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలన్నదే బిఆర్ఎస్ ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చిన రవిచంద్ర వైసీపీ కి ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి. అయితే ఇటు వైసీపీ వాకౌట్ చేస్తేనో అటు బిఆర్ఎస్ వ్యతిరేకిస్తేనో అమరావతికి చట్టబద్దత విషయంలో ఎటువంటి నష్టం జరగదు.
కానీ ఆయా పార్టీల రాజకీయ ఉద్దేశాలు ప్రజలకు అవగతం అవుతాయి అంతే. ఇన్నాళ్లు మేము అమరావతి వ్యతిరేకం కాదు అంటూ వారిస్తున్న వైసీపీ చివరికి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసరికి అమరావతి పై తమకున్న వ్యతిరేకత మొత్తాన్ని తన చర్యలతో పార్లమెంట్, రాజ్యసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పింది.
ఇక నిత్యం టీడీపీ పై విషం కక్కుతూ అటు వైసీపీ రాజకీయానికి పరోక్ష మద్దతు ప్రకటించే బిఆర్ఎస్ ఈ విషయంలో వైసీపీ కి వ్యతిరేకంగా అడుగులు వేసింది. అయితే ఇక్కడ బిఆర్ఎస్ అమరావతి చట్టబద్ధతకు మద్దతు పలకడం వెనుక భవిష్యత్ లో బీజేపీ తో ఏర్పడే రాజకీయ పొత్తులు కారణం కానున్నాయా.? అందులో భాగమే బిఆర్ఎస్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావించే టీడీపీ మహాయజ్ఞంలో తనవంతు పాత్ర పోషించిందా.?
లేదా వైసీపీ రాజకీయ మిత్రుత్వంతో బిఆర్ఎస్ ఇప్పటికే అనేక రాజకీయ ఎదురుదెబ్బలు తిన్న కారణంతో ఆ తప్పులను సరిచేసుకుని గ్రేటర్ వంటి బిఆర్ఎస్ పట్టున్న స్థానాలలో తన రాజకీయ పట్టును నిలుపుకునేందుకు బిఆర్ఎస్ వైసీపీ వ్యతిరేకించిన అమరావతి బిల్లుని స్వాగతించిందా.? అన్న చర్చ ఊపందుకుంది.




