అమరావతి ఒకరికి వరం మరొకరికి శాపం?

Amaravati political row

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన జగన్‌కి నదీ గర్భానికి, నదీ పరివాహికప్రాంతానికి తేడా తెలియదంటే నమ్మశక్యం కాదు. అదే మాట అయన పదేపదే నొక్కి చెప్పారు కనుక ఏదో ఫ్లో అనేశారని అనుకోవడానికి కూడా లేదు. కానీ ఫ్లోలో అనేశారని మర్నాడు సజ్జల రామకృష్ణా రెడ్డి సవరణ ప్రకటన చేయాల్సి వచ్చింది.

అయినా ఆలుగడ్డ అంటే పొటేటాయేనా? అని అడిగిన జగన్‌కి ఇలాంటి పెద్ద పదాలు తెలిసే అవకాశం లేదు. కానీ ఆయనకు స్క్రిప్ట్ వ్రాసిన వ్యక్తికి తెలిసి ఉండాలి కదా?కనుక సజ్జల స్క్రిప్ట్ రైటర్‌ని నిలదీయాలి.

ADVERTISEMENT

అయినా ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షహోదా కావాలని పట్టుబడుతున్న జగన్‌, స్క్రిప్టులో ఏం రాసిస్తే గుడ్డిగా చదివేయడమేనా? సజ్జల వంటి పండితులతో ఓ సారి క్రాస్ చెక్ చేయించుకోవచ్చు కదా? గతంలో నారా లోకేష్‌కి తెలుగులో మాట్లాడాటం రాదంటూ ఎగతాళి చేస్తే ఆయన పట్టుబట్టి తెలుగుపై పట్టు సాధించారు. అనర్గళంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనని ఎగతాళి చేసిన జగన్‌ మాత్రం ఇంకా నదీ గర్భంలోనే ఉండిపోయారు కదా?

సరే నదీ గర్భం అలియాస్ నదీ పరివాహక ప్రాంతమని సరిపెట్టుకున్నా, అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదని జగన్‌ తేల్చి చెప్పేశారు కదా? గతంలో ఈ విషయంలో ‘సవరణ ప్రకటన’ చేసిన సజ్జల ఈసారి చేయలేదు. ‘వరదస్తే అమరావతి మునిగిపోతుందని’ వైసీపీ వైఖరిని పునరుద్ఘాటించారు.

కనుక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అమరావతి విషయంలో వైసీపీ పునరాలోచనలో పడినప్పటికీ, మాట తప్పితే జగన్‌కి వ్రత భంగం అవుతుందనుకున్నారో ఏమో మళ్ళీ పాత వైఖరికి షిఫ్ట్ అయిపోయారు.

ఓ పొరపాటు జరిగినట్లు గుర్తిస్తే ఎవరైనా వెంటనే దానిని సరిదిద్దుకుంటారు. కానీ అమరావతిని పాడుబెట్టినందుకు వైసీపీ ఎన్నికలలో ఓడిపోయినా జగన్‌ తీరు మారలేదని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ దేశంలో, ప్రపంచంలో గొప్ప గొప్ప నగరాలన్నీ నదులు, సముద్రాల ఒడ్డునే నిర్మించబడ్డాయనే జ్ఞానం కూడా లేని జగన్‌ అమరావతి గురించి వితండవాదం చేస్తుండటం, మన రాష్ట్ర రాజకీయాలలో ఉండటం మన ఖర్మ అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ఒక్క అమరావతి విషయంలోనే కాదు… తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ, అంతర్వేది, అన్నవరం, సింహాచలం ఇలా హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల విషయంలో నేటికీ వైసీపీ తీరు మారలేదంటూ వైసీపీ చేస్తున్న ఆకృత్యాలను వివరించారు.

కనుక జగన్‌, వైసీపీ తమ వైఖరి మార్చుకోకుండా ఇలాగే కొనసాగితే చాలు…వచ్చే ఎన్నికలలో కూడా అవలీలగా మేము గెలిచేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారంటే ఆశ్చర్యం ఏముంది?

సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు అమరావతి ఒక వరం. కానీ అదే అమరావతి జగన్‌, వైసీపీలకు శాపంగా మారుతోంది. ఎందువల్ల?

ADVERTISEMENT
Latest Stories