మాజీ సిఎం జగన్ 5 ఏళ్ళు అమరావతిని టచ్ చేయకుండా వదిలేసి, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపోవడం వలన కూడా ఓ విధంగా ఏపీకి మేలే చేశారు. ఒకవేళ అమరావతి పనులలో కూడా రివర్స్ టెండరింగ్ అంటూ ప్రయోగాలు చేస్తూ, రాజధాని ప్రణాళికలను పూర్తిగా మార్చేసి పనులు జరిపించి ఉండి ఉంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగి ఉండేది. కానీ ఏపీ ప్రజల అదృష్టం కొద్దీ జగన్ అమరావతిని టచ్ చేయకుండా వదిలేశారు.
ఒకవేళ విశాఖ రాజధానిగా మార్చేసినా మళ్ళీ రాజధానిని అమరావతికి మార్చడం పెద్ద తలనొప్పిగా మారేది. కానీ ఏపీ ప్రజలని దయతలచి కేవలం రూ.450 కోట్లు ఖర్చుతో రుషికొండ ప్యాలస్లు నిర్మించుకొని విడిచిపెట్టేశారు.
కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే గతంలో రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారమే అమరావతి నిర్మాణ పనులను చేయిస్తున్నారు. అందువల్లే సీఆర్డీఏ భవన నిర్మాణం ఇంత త్వరగా పూర్తయింది.
హైదరాబాద్ విషయానికి వస్తే, అది దశాబ్దాల కాలంలో క్రమంగా అభివృద్ధి చెందింది. కనుక చిన్న వర్షం కురిసినా నగరం నీట మునుగుతుంటుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది
మూసీ నది ప్రక్షాళనకే తెలంగాణ ప్రభుత్వం సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయాల్సివస్తోంది. పాత సచివాలయం, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు భవనాలు శిధిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవలసివస్తోంది.
నగరంలో కాలువలు, చెరువులు కబ్జాలకు గురవడంతో వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ‘హైడ్రా’ ఏర్పాటు చేయాల్సివచ్చింది. అది అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్ళు భరించాల్సివస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన సమస్యలు చాలానే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో చూసినట్లయితే ప్రణాళికా బద్దంగా కొత్తగా నిర్మిస్తున్న అమరావతికి ఇటువంటి సమస్యలేవీ ఉండవు. అన్నీ ఎక్కడికక్కడ చక్కగా అమరుతున్నాయి. కనుక భారత్లోనే అమరావతి ఓ అద్భుతమైన, అత్యంత నివాస యోగ్యమైన నగరంగా ఆవిర్భవించబోతోంది. యుద్ధ ప్రాతిపదికన రాజధాని నిర్మాణ పనులు జరుగుతునందున వచ్చే ఎన్నికల నాటికి అమరావతికి రూపురేఖలు ఏర్పడటం ఖాయమే.
అమరావతిలో సీడ్ యాక్సస్ రోడ్ పక్కన ఉద్దందరాయునిపాలెంలో ఒకటీ రెండూ కాదు… ఏకంగా 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి! బెంగళూరుని ఐటి రాజధానిగా చెప్పుకున్తున్నట్లే 12 ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటు అయితే అప్పుడు ఉద్దందరాయునిపాలెంని దేశంలో ‘బ్యాంకుల రాజధాని’ అని పిలవాలేమో?
ఈ నెల 28న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వాటికి శంకుస్థాపన చేయబోతున్నారు. కనుక గ్రాఫిక్స్ అనుకున్నవారి కళ్ళెదుటే అమరావతి ఆవిర్భవించబోతోంది.






