రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు, ఆ పార్టీ విధానాలు, ఆ పార్టీ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే వైసీపీ రాజధాని అమరావతి విషయంలో భయపడుతోందా.? లేదా రాష్ట్ర ప్రజానీకాన్ని, కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టాలని భావిస్తుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులుండాలి అంటూ వాదించిన వైసీపీ అది సాధ్యం కాదని తెలిసినా తన వాదనను బలంగా వినిపిస్తూనే వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని అమరావతే అంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి పంపగా,
అటు కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్, రాజ్యసభలో బిల్లుకు ఆమోద ముద్ర వేసి రాజధానిగా అమరావతి కి చట్టబద్దత కల్పించింది. దీనితో అటు అమరావతి రైతులకు ఇటు రాష్ట్ర ప్రజలకు రాజధాని అమరావతి పట్ల ఒక స్థిరమైన నమ్మకం ఏర్పడింది.
అయితే ఆ నమ్మకాన్ని అపనమ్మకం గా మార్చాలని ఆ స్థిరత్వానికి అస్థిరత ఉందని నిరూపించాలని వైసీపీ మరోకొత్త వాదనతో తెరమీదకు వచ్చింది. రాజధాని విషయంలో ప్లాన్ బి గా మావిగన్ ను ఏర్పాటుచేయాలంటూ కొత్త ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
అలాగే ఈ ప్రతిపాదనను భవిష్యత్ లో తమ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేలా చట్ట సవరణలు చేస్తాం అంటూ రాజధాని అమరావతి విషయంలో మరోసారి ఆ ప్రాంత రైతులను, రాష్ట్ర ప్రజలను, కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూసింది వైసీపీ. అయితే ఈ భయాలకు బెదిరేది లేదు అనేలా సీఎం బాబు జగన్ ప్రకటనలను తోసిపుచ్చారు.
అయితే జగన్ ఒకపక్క తన ప్రకటనలతో రాష్ట్రం మొత్తాన్ని భయపెట్టాలని చూస్తున్నప్పటికి మరోపక్క రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందితే, ఆ ప్రాంతంలో బాబు మొదలుపెట్టిన నిర్మాణాలు పూర్తయ్యి వాడుకలోకి వస్తే ఇక వైసీపీ రాజకీయ భవిష్యత్ కి పెనుప్రమాదం తప్పదు అనే భయం కూడా జగన్ వెంటాడుతుంది.
ఇప్పటికి హైద్రాబాద్ అభివృద్ధికి నాడు బాబు వేసిన పునాదులే కీలకం అంటూ టీడీపీ మద్దతుదారులతో పాటుగా బాబు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన విజనరీ ని కీర్తిస్తారు. అలాగే నాటి హైటెక్ట్ సిటీ నిర్మాణంతో హైద్రాబాద్ చరిత్రలో చిరస్థాయిగా బాబు కోసం కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించబడ్డాయి.
ఇక నేడు అమరావతి కూడా భవిష్యత్ లో ఎటువంటి అభివృద్ధి సాధించినా దానిలో సింహ భాగం క్రెడిట్ బాబు కే దక్కుతుంది, టీడీపీ పార్టీ ఖాతాలోనే పడుతుంది. ఆ భయమే జగన్ ను స్థిరంగా ఒక్క నిర్ణయానికి పదిలం చేయలేకపోతోంది. ఒక్క రాజధానికి కట్టడిగా ఉంచలేకపోతుంది.
ఒకరోజు మేము అమరావతి వ్యతిరేకం కాదు అంటూనే మరోవైపు మూడు రాజధానులు అని, లేదు లేదు తాజాగా మావిగన్ యే మా రాజధాని నిర్ణయం అని ఇలా పూటకోమాట రోజుకో ప్రకటన చేస్తూ జగన్ తెలియకుండానే రాష్ట్రాన్ని భయపెట్టాలని చూస్తే తన భయాన్ని తానే బయట పెట్టుకుంటున్నారు.




