నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ సాగిన అమరావతి రైతుల ఉద్యమం నేడు ఏపీ అసెంబ్లీ తీర్మానం నుంచి ఢిల్లీ రాజ్యసభ లో చట్టం వరకు వెళ్ళింది.
దీనితో రాష్ట్ర రాజధానిగా అమరావతికి దక్కిన ఈ అరుదైన గౌరవం, గుర్తింపుకి ప్రతిగా నేడు సాయంత్రం 7 గంటలకు ఇంటి ముందు దీపాలు వెలింగించి ఈ చారిత్రక విజయాన్ని జరుపుకుందాం అంటూ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
“మన రాజధాని – మన గౌరవం” అంటూ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన నారా లోకేష్ అమరావతి చట్టబద్దతకు గాను ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియచేసారు. దీనితో చట్టసభలలో రాష్ట్ర రాజధానిగా అమరావతి దక్కిన గుర్తింపుతో అమరావతిలో పున్నమి వెలుగులు కురుస్తున్నాయి.
ఫలితంగా అడుగడుగునా రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ వస్తున్న వైసీపీ కి ఇక రాజకీయ గ్రహణమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ చెయ్యాల్సిన దానికంటే చాల ఎక్కువ రాజకీయమే చేసింది.
రాజధానిగా అమరావతి ఆమోదమే అంటూ కథ మొదలుపెట్టిన వైసీపీ ఇక అక్కడి నుండి మంగళగిరే రాజధాని అంటూ కాసేపు, లేదు మూడు రాజధానులు కావాలి అంటూ కాసేపు, అవసరం లేదు విశాఖ మాత్రమే ఏపీ రాజధాని అంటూ కొన్నాళ్ళు, అసలు ఏపీకి ఇప్పుడే రాజధాని ఎందుకు ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ ఉందిగా అంటూ ఇంకొన్నాళ్ళు ఇలా గత ఐదేళ్లలో ఐదు భిన్న వాదనలు వినిపించింది.
ఇక ఇప్పుడు తాజాగా రాజధానిగా అమరావతి చట్టం గా మారుతున్న వేళ వీటన్నిటిని పక్కన పెట్టి మరో మూడు నగరాలను కలుపుతూ ‘మావిగన్’ అంటూ ముందుకొచ్చారు జగన్. దీనితో పూటకో వాదనతో జగన్ చేస్తున్న రాజధాని ప్రకటనలతో రాష్ట్ర ప్రజలు అలసిపోతున్నారు.
అలాగే ఇటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం రాజధాని విషయంలో ఇలా జగన్ మారుస్తున్న మాటలను, తిప్పుతున్న మడం లను సమర్ధించలేక, ప్రజలకు నచ్చచెప్పలేక రాజకీయంగా నలిగిపోతున్నారు. నాడు 2019 – 2024 వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో జగన్ అమరావతికి ఐదేళ్లపాటు గ్రహణం పట్టించారు.
ఇక ఇప్పుడు మావిగన్ అంటూ ప్రకటించి తన చేచేతుల వైసీపీ రాజకీయ భవిష్యత్ కి గ్రహణం పట్టేలా చేస్తున్నారు. ఇక నేడు మంత్రి లోకేష్ ఇచ్చిన దీపాల పిలుపుతో రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిలో కనిపించే ఆ వెలుగులు వైసీపీ రాజకీయ చితి మంటగా మారే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అమరావతికి పట్టిన గ్రహణం వీడింది… ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుదాం. మన రాజధాని… మన గౌరవం#HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital #Amaravati pic.twitter.com/WZdUlrd6RD
— Lokesh Nara (@naralokesh) April 2, 2026




