రాజధాని అమరావతిలో తరుచుగా అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో అసలు ఈ అగ్నిప్రమాదాలకు కారణాలేంటో.? అవి యాదృచ్చికంగా జరుగుతున్నాయా.? లేదా ఎవరి కడుపు మంటనన్న చల్లార్చడానికి సాగుతున్నాయా అన్న సందేహాలు అటు ప్రభుత్వం నుంచి ఇటు సామాన్య ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్నాయి.
నిన్న అర్ధరాత్రి రాజధాని ప్రాంతం రాయపూడి వద్ద మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న హెఓడి టవర్ల సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సదరు సంస్థ నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన ఖరీదైన పైపులు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి.
కొద్దిరోజుల కిందట కూడా రాజధాని ప్రాంతమైన వెలగపూడి సమీపంలో ఎల్అండ్టీ కంపెనీకి సంబంధించిన కోట్ల విలువైన హెచ్డిపీఈ పైపులు కూడా ఇదే తరహాలో అగ్నిప్రమాదానికి ఆహుతయ్యాయి. దీనితో కొన్ని కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
ఇలా రాష్ట్ర రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఈ ప్రమాదాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2019 కి ముందు కూడా ఇదే తరహాలో అమరావతి ప్రాంతంలో చెరుకు తోటకు నిప్పుపెట్టిన ఉదంతాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు తాజాగా వెలగపూడిలో, రాయపూడిలో ఇదేమాదిరి అగ్నిప్రమాద సంఘటనలు జరగడంతో భద్రత పై అధికారులు అలసత్వం వహిస్తున్నారు కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా రాయపూడి ఘటన మీదే సత్వర దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ఉంటే ఇలా వరుస ఘటనలకు ఆస్కారం ఉండేది కాదు అనే అభిప్రాయం కూడా వినపడుతుంది.
అయితే ఈసారి జరిగిన ప్రమాదం పై అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా స్పందించారు అలాగే హోమ్ మంత్రి అనిత కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి ఘటనల పై చూసి చూడనట్టు వ్యవహరిస్తే అది వారికి అవకాశంగా మారుతుంది.
అసలు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పై, అక్కడ నిర్మాణాలు పూర్తి పై నిత్యం విష ప్రచారాలు చేసే వారు, రాజధాని పనులను ఎదోఒకరకముగా అడ్డుకోవాలనుకునే వారే ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడతారు. సీసీ కెమెరాల ఏర్పాటు, 24 గంటల పాటు భద్రతా సిబ్బందిని నియమించడం వంటి చర్యలతో ఇటువంటి వాటికీ చెక్ పెట్టవచ్చు.




