ఏటా విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. కానీ తొలిసారిగా ఈ ఏడాది రాజధాని అమరావతిలో సీడ్ యాక్సస్ రోడ్డు పక్కనే ఉన్న సువిశాలమైన మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇప్పటికే డిజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సమక్షంలో పోలీసులు రిహార్సల్స్ చేశారు. తొలిసారిగా రాజధానిలో 13,000 మందితో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ జరుగబోతున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు సుమారు లక్ష మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 22 ఎకరాలలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
అమరావతి కి భూములిచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం ఎంతగానో వేధించింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ వేడుకలలో వారి కోసమే ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయిస్తోంది. ఈ వేడుకలలో వారందరి తరపున ప్రతినిధి ఒకరు ప్రధాన వేదికపైకి ఆహ్వానించి సత్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతిలో తొలిసారిగా జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. కనుక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అత్యవసర వైద్యం అందించేందుకు వైద్య బృందం, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వగైరాలు సిద్ధం చేస్తున్నారు.
జగన్ హయంలో మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టడంతో, ఇతర రాష్ట్రాల నేతలు, ప్రజలు ‘మీ రాజధాని ఏది?’ అని అడిగితే సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు కృషి వలన కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతోంది. రాజధాని అమరావతిలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రా ప్రజలందరూ “ఇదిగో దేశంలోకే అత్యుత్తమైన మా రాజధాని అమరావతి” అని సగర్వంగా చెప్పుకునేలా చేస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం.






