తెలంగాణా రాజధాని హైదరాబాద్ ను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలిపేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాజధానుల మధ్య ప్రయాణించడానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. అమరావతి నుండి విజయవాడకు విచ్చేసి, తద్వారా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా, తిరుగు ప్రయాణం కూడా అంతే. దీంతో ఈ రెండు రాజధానుల నడుమ 278 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ వే నిర్మించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్ లో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో పాల్గొన్న ఎన్.హెచ్.ఏ.ఐ చైర్మన్ రాఘవ్ చంద్ర దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రూపకల్పన చేయాలని త్వరలోనే ఓ కంపెనీకి అప్పగిస్తామని అన్నారు. డీపీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మలి ప్రకటన ఉంటుందని తెలిపారు. మరో ఆరు మాసాల సమయం లోపున డీపీఆర్ ను సిద్ధం చేయాలని నిర్దిష్ట కాలపరిమితిని కూడా విధించామని అన్నారు.
ప్రస్తుతం అమరావతికి ఇటు విజయవాడ నుండి, అటు గుంటూరు నుండి తప్ప ఇతర రహదారులు లేవు. దీంతో రాయలసీమ కోసం ఇప్పటికే చంద్రబాబు సర్కార్ కొన్ని ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. రాయలసీమ నుండి ఒకటే చూపున (ఎలాంటి మలుపులు లేని) రహదారిని నిర్మించి చరిత్ర సృష్టించాలని ఆలోచనలు చేస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్ కు రోడ్ కనెక్టివిటీ కూడా ముందడుగులు పడడం విశేషం. ప్రతిపాదనలు అయితే బాగానే ఉన్నాయి గానీ, అందుకు సంబంధించిన భూలభ్యత ప్రశ్నార్ధకంగా మారనుంది.



