ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి అంటే ఇష్టం లేని వారు, ఎలాగైనా రాజధాని నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలువురు మంత్రులు వివిధ సందర్భాలలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణం కారణంగా గ్రీన్ కారిడార్ కు పెను ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు గ్రీన్ ట్రైబ్యూనల్ లో దాఖలు కావడం, ఈ పిటిషన్లన్నింటినీ చంద్రబాబు సర్కారు ట్రైబ్యూనల్ లో సమర్ధంగా తిప్పికొట్టడం తెలిసిన విషయమే.
దీనిపైనే తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న అమరావతి నివాస యోగ్యం కాదంటూ దాఖలైన పిటిషన్ పైన వాదోపవాదనలు జరిగాయి. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతంలో రాజధానిని ఎలా నిర్మిస్తారంటూ దాఖలైన ఈ పిటిషన్ పై ట్రైబ్యూనల్ సుదీర్ఘ వాదనలను విన్నది. ఈ విచారణకు ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కార్ కూడా హాజరయ్యారు. పిటిషనర్ల వాదనలు విన్న ట్రైబ్యూలన్ మరిన్ని వివరాలతో అనుబంధ పిటిషన్ ను దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.



