2014 రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర నుండి దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి ఏపీలో విస్తృత పాలనానుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా గాంధీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆయువు తీసింది.
అలాగే రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలనుకున్న గాంధీ కుటుంబ ఆశలను, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆకాంక్షలను రాష్ట్ర విభజన సమాధి చేసేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తల్లిని చంపి బిడ్డను బతికించిన చందంగా ఉందన్న విమర్శలు ఎదుర్కున్న కాంగ్రెస్ ఆనాటితో ఏపీలో రాజకీయంగా పూర్తిగా చచ్చిపోయింది.
దీనితో ఆ తల్లి కాంగ్రెస్ స్థానంలో పిల్ల కాంగ్రెస్ మాదిరి ఎదిగిన వైసీపీ కాంగ్రెస్ రాజకీయ బలాన్ని తన బలంగా మార్చుకుంది. ఇక దానికి తోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ఛరిష్మా వైసీపీ కి అదనపు ఆకర్షణగా నిలిచింది. దీనితో వైసీపీ అధినేత వైస్ జగన్ కు తన లక్ష్య సాధనకు పెద్ద సమయం పట్టలేదని చెప్పాలి.
2019 ఏపీలో ఎన్నికలలో 151 సీట్లలో గెలిచి మునుపెన్నడూ లేని విధంగా ఒక బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ. అయితే నాడు రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీని సజీవ సమాధి చేసినట్టుగా రాష్ట్ర రాజధాని నిర్ణయం వైసీపీ ఉసురు తీసింది.
2015 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును ప్రకటించగా నాడు ఆ నిర్ణయానికి ప్రతిపక్ష నేతగా జగన్ తన ఆమోద ముద్ర వేసి అందుకు వైసీపీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటించారు.
ఇక తరువాత 2019 లో ప్రభుత్వాలు మారడంతో జగన్ ఏపీ కి మూడు రాజధానులు అంటూ మరో కొత్త కథ మొదలుపెట్టారు. తరువాత మూడు కాదు విశాఖే ఏపీ రాజధాని అంటూ ప్రకటించి ఈ దసరాకి ఆ ఉగాదికి అంటూ కాలయాపన చేస్తూ చివరికి ముఖ్యమంత్రిగా జగన్ విశాఖలో పాలన మొదలుపెట్టకుండానే ప్రభుత్వాన్ని ముగించేశారు.
రాజధాని కేంద్రంగా వైసీపీ ఆడిన ఈ మూడు ముక్కల రాజకీయ చదరంగంలో ఏపీ రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా దేశం ముందు అనాధల నిలబడింది. ఇక రాజధానిగా అమరావతికి సైతం ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు, వేశ్యల నగరం అంటూ అమరావతి పై వైసీపీ కక్కిన నీలి విషం అమరావతిని స్మశానంగా చిత్రీకరించింది.
నాటి విభజన గాయాలతో దెబ్బతిన్న ఏపీ ఆ గాయానికి కారణమైన కాంగ్రెస్ ని రాజకీయంగా సమాధి చేస్తే, ఇక రాజధాని గాయంతో ఏపీ భవిష్యత్ ని దెబ్బకొట్టిన వైసీపీ ని 151 నుంచి 11 కి తెచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పార్టీ ఉసురు తీసింది.
అయినా వైసీపీ కి ఇప్పటికి తత్త్వం బోధపడలేదనే చెప్పాలి. తాజాగా ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతే..ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధాని మారకూడదు అనే విధంగా నేడు కూటమి ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతికి చట్ట భద్రతా కల్పించారు.
సీఎం గా బాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాదిరేకాలు వ్యక్తమవగా మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి నిట్టూర్పులు బయటకొచ్చాయి. వారు రాజధాని పై తీర్మానం చేస్తే మేము మాకు అవకాశం వచ్చినప్పుడు మాకు నచ్చినట్టుగా మరో తీర్మానం చేయలేమా.?
బాబు చట్టం చేస్తే మేము చట్టసవరణ చేయలేమా అంటూ జగన్ చేసిన ఈ ఒక్క ప్రకటన వైసీపీ పాలిట ఒక భస్మాసుర హస్తమే అవుతుంది. జగన్ తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా రాజధాని అమరావతి విషయంలో ముర్కత్వంతో వేస్తున్న ఒక్కో ముందడుగు రేపటిరోజున అది వైసీపీ ని రాజకీయంగా వెనక్కి నెడుతుంది,
అలాగే రాజధాని విషయంలో ఆయన చేస్తున్న ఒక్కో ప్రకటన వైసీపీ రాజకీయ ప్రయాణానికి ప్రాణ సంకటంగా మారుతుంది. ఏపీ విషయంలో పిల్ల కాంగ్రెస్ కూడా తల్లి కాంగ్రెస్ మాదిరే ఒక్క నిర్ణయంతోనే రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోనుందా.?




