రాష్ట్ర రాజధాని అంశాన్ని మరింత వివాదాస్పదంగా మలిచేందుకు వైసీపీ ఏ మాత్రం వెనుకాడడంలేదు. పార్టీ క్యాడర్ నుంచి పార్టీ ఆత్మసాక్షి వరకు, పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రుల నుంచి పార్టీ అధినేత వరకు ఏ ఒక్కరు ఈ అంశంలో వెనక్కి తగ్గేదెలా అనేలా వ్యవహరిస్తున్నారు.
2024 ఎన్నికల ఫలితాలను కూడా వైసీపీ పెడచెవినపెడుతూ నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా అమరావతి పై బురద రాజకీయం 2. 0 ని కొనసాగిస్తూన్నారు జగన్ అండ్ కో. అయితే ఈ విషయంలో తాజాగా జగన్ చేసిన ప్రకటనలు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
అలాగే సర్వత్రా విమర్శలను మోస్తున్నాయి, ఇక జగన్ వైఖరి మారదా.? వైసీపీ కి రాజధాని విలువ తెలియదా.? రాజకీయ నాయకులు ఎన్నికల ముందు పార్టీల జెండాలు మార్చినట్టు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్ర రాజధానిని మారుస్తారా.? అంటూ వైసీపీ పై ఎదురుదాడి మొదలైన నేపథ్యంలో,
మాజీ సకల శాఖ మంత్రి, వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి జగన్ ప్రకటనల వెనుక ఉన్న సారాంశాన్ని విశదీకరించే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే నిన్న జగన్ ప్రకటనలు – నేడు సజ్జల గారి సంజాయిషీలు నమ్మే పరిస్థితులలో ఏపీ ప్రజలు లేరు అనే అంశాన్ని వైసీపీ గ్రహించాలి.
రాజధాని పై వైసీపీ ఎన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా, ఎన్ని కాకామ్మ కథలు వినిపించినా వాటిని విశ్వసించే స్థాయిలో ఏపీ ప్రజానీకం లేరనే చెప్పాలి. ఒకసారి నమ్మిన పాపానికి రాష్ట్రం విడిపోయి దాదాపు పుష్కర కాలం గడిచినా ఇప్పటికి రాజధాని చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరిగేలా చేసింది వైసీపీ.
అటువంటి వైసీపీ ఇప్పుడొచ్చి “మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని వారించినా, అమరావతికి వ్యతిరేకమే అని బెదిరించినా” అది వైసీపీ భవిష్యత్ కి సమాధులు తవ్వినట్టే అవుతుంది. కాబట్టి వైసీపీ అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అది ఆ పార్టీకి ఆ పార్టీ నేతలకు అంత మేలు చేస్తుంది అనేది వాస్తవం.






