రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు కావస్తోంది. కానీ నేటికీ ఏపీలోని అధికార, ప్రతిపక్షపార్టీల ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ నగరమే అంటే అతిశయోక్తి కాదు.
అనేక దశాబ్దాలుగా అక్కడ నివాసాలు, ఆస్తులు, వ్యాపారాలు ఉన్నందున హైదరాబాద్ని అంటిపెట్టుకొని ఉంటున్నారని సర్దిచెప్పుకున్నా, కాల్లో ముల్లు గుచ్చుకున్నా, గుండెపోటు వచ్చినా అందరూ హైదరాబాద్కే పరిగెడతారు.
చివరికి విందులు, చిందులు కూడా అక్కడే.. కేసులు కూడా అక్కడే! తెలంగాణవాదులు, బీఆర్ఎస్ పార్టీ ఛీకొడుతున్నా నిసిగ్గుగా హైదరాబాద్ పట్టుకునే వ్రేలాడుతుంటారు.
మనది కాని హైదరాబాద్ మీద ఇంత ప్రేమ చూపిస్తున్న మన రాజకీయ నాయకులలో ఎంత మంది అమరావతిని సందర్శించారు? కనీసం ఎంతమంది అమరావతి గురించి నాలుగు ముక్కలు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించుకుంటే సమాధానం లభించదు. కానీ అమరావతిని విమర్శించడానికి, కోడిగుడ్డుకి ఈకలు పీకినట్లు తప్పులు ఎంచేవారు చాలా మందే ఉన్నారు.
అమరావతి చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నవారు కూడా అమరావతి కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు. వారి రియల్ ఎస్టేట్ ఆఫీసులు, కార్యకలాపాలు అక్కడి నుంచే జరుగుతుంటాయి.
అంటే ఏపీ రాజధానిగా అమరావతి ఎన్నటికీ పూర్తవదని, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందలేదని వారు భావిస్తున్నారా?అందువల్లే హైదరాబాద్, బెంగళూరు పట్టుకొని వ్రేలాడుతున్నారా?అనే సందేహం కలుగుతుంది.
కానీ ఎవరు ఏమనుకున్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి సిద్దమవుతోంది. దానికి ఆటంకాలు కల్పించకుండా ఉంటే చాలు!




