జగన్మోహన్ రెడ్డి సిఎం కాగానే అమరావతి నిర్మాణ పనులన్నీ నిలిపివేసి 5 ఏళ్ళు నిర్దాక్షిణ్యంగా పాడు బెట్టేశారు. వైసీపీ ఓటమికి అదీ ఓ కారణమే. కానీ నేటికీ అందుకు జగన్తో సహా వైసీపీ నేతలెవరూ పశ్చాతాపపడటం లేదు!
అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటు ఆమోదముద్ర వేస్తుంటే దానినీ వ్యతిరేకించారు. ‘మావిగన్ రాజధాని’ పేరుతో మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టారు. కనుక అమరావతిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జగన్ అండ్ కో స్వయంగా చాటింపు వేసుకున్నట్లే!
రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎం కాగానే అయన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంచుమించు ఇలాగే వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తుంటాయి.
కానీ ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాలలో కాళేశ్వరం ఒకటని కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకునే ఆ ప్రాజెక్టు, అయన సిఎంగా ఉన్నప్పుడే క్రుంగిపోయింది. బ్యారేజీ గోడలు బీటలు వారాయి!
ఆ పరిస్థితిలో వాటిలో నీటిని నిల్వచేస్తే మొత్తం బ్యారేజీ కూలిపోయి, వాటి దిగువనున్న గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ హెచ్చరించింది.
అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అపనిందల నుంచి కాపాడుతోంది. బ్యారేజీలకు మరమత్తులు చేయించి వాడుకోవచ్చని సూచించింది.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా ఇంత వరకు మరమత్తులు చేయించకుండా తాత్సారం చేస్తుండటాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పు పడుతూనే ఉంది.
కాళేశ్వరంని మళ్ళీ వినియోగంలోకి తెస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనే అసూయతోనే దానిని సిఎం రేవంత్ రెడ్డి పాడు బెట్టేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తూనే ఉన్నారు.
అంటే ఇక్కడ జగన్ అమరావతి నిర్మాణ పనులు కొనసాగించక పోవడానికి కారణం చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందనే అసూయతోనే అనుకోవాల్సి ఉంటుంది.
కానీ రెండున్నరేళ్ళు ఆలస్యంగానైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని కాళేశ్వరం ప్రాజెక్టుకి యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది.
కల్వకుంట్ల కవితతో సహా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలలో పరస్పరం పోటీ పడాలి కానీ అసూయతో రాజకీయాలు చేయరాదు. చేస్తే నష్టపోతామని రేవంత్ రెడ్డి గ్రహించబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మరమత్తులకు సిద్దమవుతున్నారు.
కానీ జగన్ 5 ఏళ్ళు పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి మారిన తర్వాత కూడా అమరావతి విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మావిగన్తో స్పష్టం చేశారు.
తద్వారా ఒకవేళ తాను మళ్ళీ సిఎం అయితే అమరావతిని రాజధానిగా వినియోగించబోనని జగన్ సూచిస్తున్నట్లే ఉంది. ఇలాంటి అసూయ, ద్వేష, కపట రాజకీయాలు చేసేవారిని ప్రజలు మెచ్చరని మావిగన్ బ్యాచ్ ఎప్పటికైనా తెలుసుకుంటారో లేదో?




