అంబానీ, ఆదానీలు మంచోళ్ళా కాదా?

Ambani Adani Debate

అంబానీ, ఆదానీలు మంచోళ్ళా కాదా? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న అనిపించవచ్చు. కానీ అందరూ వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళేనని ఒప్పుకోరు. అలాగని చెడ్డవాళ్ళని కూడా చెప్పలేరు. కారణాలు తెలిసినవే.

అంబానీలు క్రమంగా వ్యాపారాలలో రాణించి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరించారు. కానీ అదానీమాత్రం ఆకాశం నుంచి ఊడి పడినట్లు ప్రత్యక్షమై దేశమంతా అల్లుకుపోయారు.

ADVERTISEMENT

వారికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపిలతో ఉండే అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. దానిని వారు చాలా తెలివిగా ఉపయోగించుకుంటూ, ఎలా విస్తరిస్తున్నారో దేశ ప్రజలందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.

వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసేస్తుంది. కానీ సామాన్య రైతులు రుణాలను మాఫీ చేయడానికి మనసొప్పదని వామపక్షాలు, గిట్టనివారు విమర్శిస్తూనే ఉంటారు. వారిరువురికీ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని దోచిపెడుతోందని విమర్శిస్తూనే ఉన్నారు.

అదానీ కంపెనీలకు అడవులపై దృష్టి పడింది. కనుక అదానీ కంపెనీల కోసమే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అడవులలో దాగి ఉన్న మావోయిస్టులను ఎరిపారేసి ‘జంగిల్ క్లియరెన్స్’ చేస్తోందని మావోయిస్టులు, ప్రజా హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్, పచ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అయ్యాయని జాతీయ పత్రికలో వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అనుకుంటే, ఇప్పటికే దేశం నలుమూలల ‘గుర్రం డెక్క మొక్కలా’ విస్తరించేసిన అదానీ కంపెనీలు పచ్చటి అడవులని కూడా కబ్జా చేయబోతోందని అనుకోవాల్సి ఉంటుంది. కనుక అదానీ మంచివాడేనా? అంటే కాదనే అనిపిస్తుంది.

కానీ అదానీ గ్రూప్ పెట్టుబడుల కోసం ఏపీ, తెలంగాణలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ! ఎందువల్ల అంటే, అదానీ కంపెనీ పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరం. ఆ కంపెనీల ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కనుక అదానీ మంచోడే కదా? అనుకోకుండా ఉండగలమా?

ఇప్పుడు అంబానీ గ్రూప్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుంటే, జియో ఫోన్‌లతో అత్యంత తక్కువ ధరకు దేశ ప్రజలకు మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రిలయన్స్ కంపెనీల ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారు. ఆ కంపెనీ షేర్లు కొన్నవారికి ఇబ్బడిముబ్బడిగా లాభాలు అందిస్తున్నారు. టిటిడీతో సహా దేశంలో పలు ఆలయాలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. కనుక అంబానీలు చాలా మంచివాళ్ళే కదా?

కానీ జియోతో దేశంలో బిఎస్ఎన్ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలను తేరుకోలేని విధంగా దెబ్బ తీశారు. రష్యా నుంచి దాదాపు సగం ధరకు భారత్‌ దిగుమతి చేసుకున్న చమురులో అధికశాతం అంబానీల ఆయిల్ కంపెనీలకే వెళ్ళింది తప్ప సామాన్య ప్రజలకు దాని వలన ఒక్క రూపాయి లబ్ది కలగలేదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

సామాన్య ప్రజల కనీస అవసరాలు తీర్చి వారి ప్రయోజనాలు కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం చూపుతాయి. కానీ అంబానీ, అదానీలు కొండ మీద కోతి కావాలంటే తెచ్చి ఇస్తాయని వామపక్షాలు, గిట్టనివారు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. కనుక అంబానీ, అదానీలు మంచోళ్ళా కాదా?అనే ప్రశ్నకు ఎవరికీ వారే సమాధానం చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories