గతంలో వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వంటి పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. కానీ అప్పుడు పెద్దగా హడావుడి జరుగలేదు. కానీ అంబటి వ్యవహారం ఇంతగా హైలైట్ అవుతుండటం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
దీనిలో కులం కోణంపై చర్చ జరుగుతోంది. టీడీపి శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడటంపై చర్చ జరుగుతోంది. వైసీపీ పట్ల సిఎం చంద్రబాబు నాయుడు మెతక వైఖరి వహిస్తుండటంపై టీడీపి శ్రేణులలో పేరుకుపోయిన అసహనానికి ఈ దాడి ఓ నిదర్శనమనే చర్చ జరుగుతోంది.
“రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళ పట్ల వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపి నేతలు తప్పు పడుతుంటారు. కానీ ఇప్పుడు టీడీపి శ్రేణులు కూడా మా ఇంటిపై దాడి చేశారు కదా? ఇంట్లో ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు కదా?” అని ఆయన కుమార్తె ప్రశ్నిస్తున్నారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ విసిరినా ఈ ‘అంబటి ఉచ్చు’లో కూటమి ప్రభుత్వం చిక్కుకుందా? లేక అంబటి రాంబాబుని ప్రయోగించి వైసీపీయే అడ్డంగా దొరికిపోయిందా?
అంబటి వ్యవహారంపై ఇలా రకరకాల కోణాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒంటి చేతి చప్పట్లు కావని చెప్పక తప్పదు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మద్య మొదలైన యుద్ధం, సిట్ నివేదికతో పతాకస్థాయికి చేరుకుంది. అదే అనూహ్యంగా ఈ మలుపు తీసుకొని అంబటిని జైలుకి పంపింది.
కనుక ఈ యుద్ధం, పరిణామాలు, వాదనలు ఏవీ యాదృచ్చికం కావని అర్ధమవుతోంది. అయితే ఈ కేసులో చిక్కుకొని బయటపడలేక వైసీపీ అంబటి రాంబాబు ద్వారా ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందా? లేదా నెయ్యిలో కొవ్వు కలిసిందని బల్ల గుద్ది వాదించిన కూటమి ప్రభుత్వం, అది తప్పని తేలడంతో ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందా? అనే ప్రశ్నకు ఎవరికి నచ్చిన జవాబు వారు చెప్పుకునే వెసులుబాటు ఉంది.






