మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ నోటికి బాగా పని చెపుతూనే ఉంటారు. ఏటా సంక్రాంతికి సత్తెన్నపల్లిలో డాన్సు చేస్తూనే ఉంటారు. కానీ ఇంత చేసినా ఆయనకు సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. కానీ ఇటీవల గుంటూరులో సిఎం చంద్రబాబు నాయుడుని, పోలీస్ అధికారులను బూతులు తిట్టడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. మూడు ఫ్లాపుల తర్వాత హిట్ కొట్టిన హీరోలా ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
దీనికి కారణం ఆయన బూతులా లేక ఆయనకు ఈ స్క్రీన్ ప్లే ఇచ్చి డ్రామా రక్తి కట్టించిన వైసీపీ మేధావులదా లేక సిఎం చంద్రబాబు నాయుడుని, ఆయన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం అత్యుత్సాహమా? ఏది కారణం? అంటే మూడూ అని చెప్పుకోవాలి.
నెలరోజుల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వచ్చి ముగింపు దశకి చేరుకున్నట్లు, ఈ అంబటి ఎపిసోడ్లకు జగన్ పరామర్శయాత్రతో ముగించారు. కానీ అంబటి రాంబాబు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇంట్లో ఆడాళ్ళ పేర్లు, ప్రస్తావన సబబు కాదు. కనుక ఆయన కుటుంబ సభ్యులని చెప్పుకుంటే, వారు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.
రాజకీయాలలో ఇంతకాలం చాలా హుందాగా వ్యవహరిస్తున్న తాను టీడీపి శ్రేణులు రెచ్చగొట్టేసరికి బ్యాలన్స్ కోల్పోయి బూతులు మాట్లాడానని చాలా పశ్చాతాప పడ్డారని అన్నారు. కానీ కేంద్ర మంత్రి, ఓ మహిళా ఎమ్మెల్యే చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కానీ తమ కుటుంబానికి శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని అంబటి రాంబాబు గారు చెప్పేవారన్నారు. ఉన్నాయి కనుక అధికార పార్టీ వాళ్ళు మాపై రాళ్ళు విసిరినా అవి మాపై పడేసరికి పూవులుగా మారిపోతాయన్నారు.
అంబటి రాంబాబు నీతులు, బూతులు,సంస్కారం, హుందాతనం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ప్రాయశ్చిత్తం కొరకే గుడికి వెళ్ళారు. కానీ తిరిగి వస్తూ బూతులతో సిఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. కనుక రాంబాబు ప్రాయశ్చిత్తం, పశ్చాతాపం రెండూ నిజం కావని ఆయనే నిరూపించుకున్నారు. ఒకవేళ ఆయన కుటుంబ సభ్అయులు చెపుతున్నదే నిజమనుకున్నా రేపు బెయిల్పై జైలు నుంచి బయటకు రాగానే నోరువిప్పి తప్పని ఆయనే ఎలాగూ నిరూపిస్తారుగా?
ధర్మ సందేహం: ఇంతకీ కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబుని ఓవర్ నైట్ హీరోగా ఎందుకు మార్చేసింది? ఆయనకు ఇంత హైప్ వస్తే జగన్ తట్టుకోలేరు. కనుక ఏదో చేస్తారనే దురాశతోనేనా?






